Begin typing your search above and press return to search.

కర్తవ్యమే పరమావధి! పెళ్లయిన వెంటనే డ్యూటీలో జవాన్.. భార్య కన్నీటి వీడ్కోలు

మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో హృదయానికి హత్తుకునే సంఘటన చోటు చేసుకుంది. ఒక జవాన్ తన పెళ్లయిన రెండు రోజులకే దేశ సేవ కోసం సరిహద్దుకు తిరిగి వెళ్లాడు.

By:  Tupaki Desk   |   10 May 2025 12:50 PM IST
కర్తవ్యమే పరమావధి! పెళ్లయిన వెంటనే డ్యూటీలో జవాన్.. భార్య కన్నీటి వీడ్కోలు
X

మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో హృదయానికి హత్తుకునే సంఘటన చోటు చేసుకుంది. ఒక జవాన్ తన పెళ్లయిన రెండు రోజులకే దేశ సేవ కోసం సరిహద్దుకు తిరిగి వెళ్లాడు. కర్తవ్యమే పరమావధిగా భావించిన ఆ వీరుడికి అతడి భార్య కూడా అడ్డు చెప్పలేదు. కళ్లలో నీళ్లు నిండినా, నుదుటిన సింధూరం చెదిరిపోకుండా చూసుకుంటూ ‘నా సింధూరం దేశం కోసం’ అంటూ గర్వంగా వీడ్కోలు పలికింది. ఆ సైనికుడి నిబద్ధతకు, అతని భార్య గొప్ప మనసుకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.

పాచోరా తాలూకాలోని ఖేడ్‌గావ్ నందిచే గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్‌కు మే 5న యామిని అనే యువతితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన వెంటనే సరిహద్దులో డ్యూటీకి హాజరు కావాలని అతనికి పిలుపు వచ్చింది. దేశభక్తికి నిదర్శనంగా నిలిచిన మనోజ్ తన భార్యకు ధైర్యం చెప్పి వెంటనే డ్యూటీలో చేరాడు.

మే 7న పచోరా రైల్వే స్టేషన్ నుంచి తన పోస్టింగ్ స్థలానికి బయలుదేరాడు. అతని భార్య, తల్లిదండ్రులు, బంధువులు అతనికి వీడ్కోలు పలకడానికి చేరుకున్నప్పుడు అందరి కళ్లూ చెమర్చాయి. కానీ వారి ముఖాల్లో దేశభక్తి గర్వం స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంగా భార్య యామిని మాట్లాడుతూ.. “నా సింధూరం దేశం కోసం. నా భర్త దేశానికి సర్వీసు చేస్తున్నందుకు నేను గర్విస్తున్నాను” అని అన్నారు. యామిని కళ్లలో కన్నీళ్లు ఉన్నప్పటికీ ఆమె చేతులపై ఇంకా మెహందీ మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి.

కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం మే 7న ‘ఆపరేషన్ సింధూర్’ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 9 స్థావరాలపై వైమానిక దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. దీని తర్వాత సెలవుపై వెళ్లిన సైనికులందరినీ తిరిగి డ్యూటీకి పిలిపించారు. ఎందుకంటే పరిస్థితులు యుద్ధంలా మారాయి.

మనోజ్ పాటిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ ప్రాంతమంతా ప్రశంసిస్తోంది. పచోరా స్టేషన్‌లో అతనికి వీడ్కోలు చెబుతున్నప్పుడు గ్రామస్తులు జై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి విజయ్ సింగ్ పాటిల్‌ను కూడా అభినందించారు. మనోజ్ బయలుదేరుతూ మాట్లాడుతూ.. “మా జవాన్లు ఒక్క ఉగ్రవాదిని కాదు, పది మందిని కూడా చంపగలరు. విజయం మాదే అవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.