7గురి ప్రాణాలు తీసిన ‘గోడ’ ఉదంతంలో 8మందిపై చర్యలు!
తాజాగా చర్యలకు ఉపక్రమించింది. గోడ నిర్మించాలని ఆదేశించిన ఈవోను సస్పెండ్ చేయటంతో పాటు.. దీని నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలతో పాటు.. బ్లాక్ లిస్టులో పెట్టింది.
By: Tupaki Desk | 6 May 2025 4:42 AMచందనోత్సవం సందర్భంగా సింహాచలం పుణ్యక్షేత్రంలో నిర్మించిన గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన వైనం తెలిసిందే. ఈ ఉదంతం చంద్రబాబు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసింది. చందనోత్సవం లాంటి కీలక కార్యక్రమానికి ఏర్పాట్లు.. భద్రతాపరమైన చర్యలు తీసుకోవటంలో వైఫల్యం చెందినట్లుగా విపక్షం విరుచుకుపడటం తెలిసిందే. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా చర్యలకు ఉపక్రమించింది. గోడ నిర్మించాలని ఆదేశించిన ఈవోను సస్పెండ్ చేయటంతో పాటు.. దీని నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలతో పాటు.. బ్లాక్ లిస్టులో పెట్టింది.
అదే సమయంలో ఆరుగురు ఇంజనీర్ల మీద వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఇద్దరు ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30న జరిగిన ఈ ఘటనపై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్.. ఐజీ ఆకే రవిక్రిష్ణ.. జలవనరుల శాఖ ఈఎన్ సీ వెంకటేశ్వరరావుతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను తాజాగా అందజేయగా.. అందులో పేర్కొన్న విధంగా చర్యలు చేపట్టారు.
షాకింగ్ నిజం ఏమంటే.. గోడ నిర్మాణానికి ఎలాంటి ప్లాన్.. డిజైన్ లేకపోవటం.. నాణ్యత పాటించకపోవటం.. ఇంజినీర్లు.. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం ప్రమాదానికి కారణాలుగా కమిటీ తేల్చింది. గోడ కూలిన ఉదంతానికి సంబంధించి చేపట్టిన విచారణలో తాము గుర్తించిన అంశాల్ని రిపోర్టులో పేర్కొన్నారు. అందులోని కీలక అంశాల్ని చూస్తే.. గోడ నిర్మాణానికి డిజైన్ లేదని.. డ్రాయింగ్ .. ప్లాన్ రూపొందించలేదన్నారు. ఆ గోడ అధిక బరువు తట్టుకునేలా లేదని.. పునాది లేకుండానే నేరుగా నేల మీదనే గోడను నిర్మించారన్నారు. నాణ్యత లేని ఫాల్ జి ఇటుకల్ని వాడారని.. నిర్మాణానికి వినియోగించిన సిమెంటులో నాణ్యత లేదని తేల్చారు. గోడకు క్యూరింగ్ చేయకపోవటం.. సమీపంలో తవ్విన మట్టి.. శిథిలాలను గోడ వెనుక పోయటంతో దాని మీద ఒత్తిడి పెరిగి గోడ కూలేందుకు కారణమైంది.
ఈ గోడ నిర్మాణంలో సహజంగా వచ్చే వర్షపునీటి ప్రవాహానికి గోడ అడ్డుగా నిలవటంతో పాటు.. నీరు పోయేందుకు డ్రైనేజీ.. గోడపై ఒత్తిడి తగ్గించి నీరు బయటకు వెళ్లేలా వీప్ హోల్స్ ఏర్పాటు చేయలేదని తేల్చారు. బలంగా లేని గోడకు.. ఉత్సవం కోసం వేసిన తాత్కాలిక షెడ్డు సపోర్టు బీమ్ లను దన్నుగా ఏర్పాటు చేశారు.
వీటన్నింటితో పాటు భారీ గాలి.. వర్షంతో గోడ మీద ఒత్తిడి మరింత పెరిగి చివరకు కూలేలా చేసినట్లుగా గుర్తించారు. గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్ లేదని.. గోడ నిర్మాణానికి అంచనా.. ఇతర రికార్డులేవీ నిర్వహించలేదన్న విషయాన్ని గుర్తించారు. చర్యలు ఎవరి మీదన్న విషయానికి వస్తే.. సింహాచలం ఆలయ ఈవో.. ఆలయ ఈఈ.. పర్యాటక సంస్థ ఈఈ.. ఆలయ డీఈ.. పర్యాటక సంస్థ డీఈ.. పర్యాటక సంస్థ ఏఈ.. ఆలయ ఏ.. కాంట్రాక్టర్.. దేవాదాయ కమినర్.