ఈ 'గీతలు' పనిచేయట్లేదే ..!
కానీ, ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేకపోవడం.. కనీసంలో కనీసం.. ఆమెకు బలమైన ఓటు బ్యాంకు కూడా లేని నేపథ్యంలో గీత వ్యవహారంపై బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు.
By: Garuda Media | 17 March 2026 9:00 PM ISTరాజకీయాల్లో కొందరు మహిళా నాయకులు ఒకప్పుడు దూకుడుగా ఉన్నారు. ఇంటా బయటా కూడాతమదే చక్రం అన్నట్టుగా తిప్పారు. కానీ, తర్వాత.. కాలంలో మౌనం పాటించారు. ఇలాంటి వారిలో 'గీత' పేరున్న ఇద్దరు మహిళా నాయకుల గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 1) కొత్తపల్లి గీత. ఈమె గిరిజన నాయకురాలిగా ప్రచారం చేసుకుంటున్నా.. ఆమెపై ఆరోపణలు వున్నాయి. సరే.. గతంలో వైసీపీ తరఫున అరకు ఎంపీగా విజయం దక్కించుకున్నారు.
ఆ తర్వాత.. కనీసం జగన్ మొహం కూడా చూడకుండానే.. పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొన్నాళ్లు టీడీపీకి మద్దతుగా నిలిచారు. కానీ, ఫలితందక్కలేదు. దీంతో సొంత పార్టీ పెట్టుకుని 2019లో పోటీ చేశారు. కానీ, అది కూడా విఫలమైంది. ఇక, 2024 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ తరఫున టికెట్ పొందినా.. మరోసారి పరాజయమే ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఏకంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆమె పేరు తెరమీదికి వచ్చిందని అంటున్నారు.
కానీ, ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేకపోవడం.. కనీసంలో కనీసం.. ఆమెకు బలమైన ఓటు బ్యాంకు కూడా లేని నేపథ్యంలో గీత వ్యవహారంపై బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు. ఇక, వైసీపీకి చెందిన మరో గీత.. మాజీ ఎంపీ. గీతా విశ్వనాథ్గా పేరున్న ఆమె... గతం నుంచి తరచుగా వార్తల్లో ఉన్నారు. ప్రజారాజ్యం.. వైసీపీలలో ఆమెకు పేరుంది. గత ఎన్నికలకుముందు కాకినాడ ఎంపీగా.. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్పై పిఠాపురం నుంచి ఆమె పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఇక, ఇప్పుడు మరోసారి కాకినాడే కావాలని ఆమె కోరుతున్నా.. పిఠాపురంలోనే రాజకీయాలు చేయాలని వైసీపీ చెబుతోంది. కానీ, ఇక్కడ పవన్ ను విమర్శించే పరిస్థితి లేదు.(సిట్టింగ్ ఎమ్మెల్యే కదా). ఎందకంటే.. ఉన్న పాజిటివ్ ఓటు బ్యాంకు కూడా పోతుందన్న భయం గీతను వెంటాడుతోంది. పోనీ.. మౌనంగా ఉంటే.. పార్టీ నుంచి ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో అటు నియోజకవర్గంలోనే అడుగు పెట్టకుండా.. ఇటు రాజకీయాలు కూడా చేయకుండా గీత మౌనంగా ఉన్నారు. ఇదీ.. ఈ గీతల పరిస్థితి.
