ఏఎస్పీని కొట్టబోయిన సీఎం- తీవ్ర దుమారం
బెళగావిలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా కొందరు బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
By: Tupaki Desk | 29 April 2025 1:00 PM ISTకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం బెళగావిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్యూటీలో ఉన్న అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) నారాయణ్ భారమణిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సిద్ధరామయ్య తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బెళగావిలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా కొందరు బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఇది చూసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అగ్రహానికి లోనయ్యారు. వేదికపై ఉన్న ASP నారాయణ్ భారమణిని పిలిచి, భద్రతా లోపంపై ప్రశ్నించారు. కోపంతో ఊగిపోయిన సిద్ధరామయ్య పోలీసు అధికారిపై చేయి ఎత్తబోయారు. అయితే, అధికారి వెనక్కి జరగడంతో ఆయన చేయి తగల్లేదు. లక్షలాది మంది సమక్షంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.
ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బీజేపీ నాయకులు సిద్ధరామయ్య చర్యను ఖండిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధిగా ఐదేళ్లే అధికారం ఉంటుందని, కానీ ప్రభుత్వ అధికారులు 60 ఏళ్ల వరకు సర్వీసులో ఉంటారని, కనీస జ్ఞానం లేకుండా సిద్ధరామయ్య వ్యవహరించారని విమర్శించారు. జేడీ(ఎస్) పార్టీ కూడా సిద్ధరామయ్య తీరును నియంతృత్వ ధోరణిగా అభివర్ణించింది. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికింది.
అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సిద్ధరామయ్య చర్యను పరోక్షంగా సమర్థిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలకు ఏం పని అని ప్రశ్నించిన ఆయన, ఈ ఘటనకు బీజేపీ శ్రేణుల అత్యుత్సాహమే కారణమని ఆరోపించారు.
మొత్తానికి బెళగావిలో జరిగిన ఈ సంఘటన కర్ణాటక రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పోలీసు అధికారిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా సిద్ధరామయ్య ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తాజా వివాదం సిద్ధరామయ్య ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.