Begin typing your search above and press return to search.

ఆస్తి కోసం అమ్మ చనిపోయినట్లు పోస్టర్లు వేయించాడు

అసలు వీడు మనిషేనా? అన్న సందేహం కలగటంతో పాటు.. ఇలాంటోడికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే అన్నట్లుగా అనిపించక మానదు

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:34 AM GMT
ఆస్తి కోసం అమ్మ చనిపోయినట్లు పోస్టర్లు వేయించాడు
X

ఈ ఉదంతం గురించి తెలిసినంతనే రక్తం మరిగిపోవటం.. అసలు వీడు మనిషేనా? అన్న సందేహం కలగటంతో పాటు.. ఇలాంటోడికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే అన్నట్లుగా అనిపించక మానదు. ఆస్తి కోసం కన్నతల్లి బతికి ఉండగానే.. చనిపోయినట్లుగా ఊరంతా పోస్టర్లు అంటించిన ఈ ఛండాలుడికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే అవుతుంది. ఈ ఘోరమైన ఉదంతం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

తాను బతికి ఉండగానే తన కొడుకు చేసిన నిర్వాకం గురించి తెలిసిన ఆ తల్లి కన్నీరుమున్నీరు అవుతోంది. ఇంత నీచమైన ఉదంతంలోకి వెళిత.. నాగర్ కర్నూలులోని ఈదమ్మ గుడి కాలనీలో కౌసల్య అనే పెద్దావిడకు కొడుకు.. కుమార్తె ఉన్నారు. కొడుకు రాజు రోజూ తన భార్యతో గొడవ పడుతుంటాడు. దీంతో.. అతన్నివదిలేసిన భార్య వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన తర్వాత తల్లిని ఏదో పేరుతో వేధించటం చేసేవాడు.

దీంతో.. కన్నకొడుకును భరించలేకపోయిన ఆ తల్లి.. కొడుకును వదిలేసి.. కోడలు కౌసల్య వద్దకు వెళ్లి బతుకుతోంది. కన్నకొడుకునే వదిలేసి.. కోడలు వద్దకు వెళ్లిపోయిందంటేనే అతగాడు ఎలాంటోడన్న సంగతి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తల్లి ఆస్తి మీద కన్నేసిన ఈ దర్మార్గుడు.. ఏ కొడుకు చేయని దారుణానికి తెర తీశారు. ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని కొట్టేసేందుకు డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసేందుకు దుర్మార్గపు పనికి ఒడిగట్టాడు. తన తల్లి చనిపోయిందంటూ ఊరంతా పోస్టర్లు వేయించాడు.

తన తల్లికి నివాళులు అర్పిస్తూ.. శ్రద్ధాంజలి పలుకుతూ పోస్టర్లు వేయించాడు. దీంతో.. ఈ విషయం తెలుసుకున్న కౌసల్య.. తాను బతికే ఉన్నానని.. కోడలు.. మనవళ్ల వద్ద సంతోషంగా ఉన్నట్లుగా వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ జారీ చేయొద్దంటూ మున్సిపల్ అధికారులనుకోరింది. ఆస్తి కోసం తన కొడుకు ఇంతటి నీచానికి పాల్పడినట్లుగా పేర్కొన్న ఆమె.. తాను బతికి ఉన్నట్లుగా తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేయటం చర్చనీయాంశంగా మారింది. ఆస్తి కోసం ఇంతటి దారుణానికి ఒడిగడతారా? అంటూ అందరూ విస్తుపోతున్నారు.