Begin typing your search above and press return to search.

"అందరు దొంగలే"... పొత్తుపై షర్మిళ ఘాటు వ్యాఖ్యలు!

ఈ క్రమంలో ఈ పొత్తులపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

By:  Tupaki Desk   |   10 March 2024 8:23 AM GMT
అందరు దొంగలే... పొత్తుపై షర్మిళ  ఘాటు వ్యాఖ్యలు!
X

నిన్నమొన్నటివరకూ ఏపీలో ఉన్న టీడీపీ - జనసేన కూటమిలోకి తాజాగా బీజేపీ కూడా చేరిన సంగతి తెలిసిందే. వీరు వారి కోరిక మేరకు చేరారా.. వారు వీరి కోరికను మన్నించి చేరారా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... 2014 తరహాలోనే టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈసారి జనసేన అభ్యర్థులు కూడా బరిలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా 24 ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ పొత్తులో భాగంగా బీజేపీ - జనసేనలకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు మీడియాకు లీకులు వదిలినట్లు తెలుస్తుంది. ఇందులో 6 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో దిగబోతున్నారని కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో ఈ పొత్తులపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

అవును... సీట్ల పంపకాల సంగతి కాసేపు పక్కనపెడితే 2014 తరహాలోనే టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తున్నట్లు చేసిన ప్రకటనపై వైఎస్ షర్మిళ ఘాటుగానే స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. "అందరూ దొంగలే" అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై స్పందించిన షర్మిళ... "అందరూ దొంగలే.. ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా.. ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా.. రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఐదు సంవత్సరాలపాటు బీజేపీ పొత్తుపెట్టుకుని కూడా ప్రజలకు న్యాయం చేయకపోయినా.. మళ్లీ అదే బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు అని షర్మిళ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో... 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని షర్మిళ ట్విట్టర్ లో స్పందించారు.