Begin typing your search above and press return to search.

సాక్షిలో సగం వాటా షర్మిలకు ఉందా?

ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా బాధ్యతల్ని చేపట్టిన షర్మిల తన సోదరుడిపైనా.. ఆయన ప్రభుత్వం మీదా విమర్శలతో విరుచుకుపడటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Jan 2024 5:36 AM GMT
సాక్షిలో సగం వాటా షర్మిలకు ఉందా?
X

ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా బాధ్యతల్ని చేపట్టిన షర్మిల తన సోదరుడిపైనా.. ఆయన ప్రభుత్వం మీదా విమర్శలతో విరుచుకుపడటం తెలిసిందే. తాజాగా మాట్లాడిన ఆమె సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందన్న విషయాన్ని ప్రస్తావించటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారు. తనకు సగం వాటా ఉన్న సంస్థనే తన మీద బురద జల్లుతుందన్న వాదనను వినిపిస్తున్న షర్మిలకు నిజంగానే వాటా ఉందా? ఉంటే.. అందులో నిజమెంత? చట్టబద్ధంగా.. న్యాయబద్ధంగా ఆమెకు సాక్షిలో భాగస్వామ్యం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ లెక్క చూడటానికి ముందు.. సాక్షిలా తనకు సగం వాటా ఉందన్న షర్మిల.. ఈ అంశం మీద ఏం చెప్పారు? అన్నది ఆమె మాటల్లోనే చూస్తే విషయంపై మరింత స్పష్టత రావటం ఖాయం. ‘‘ఆస్తిలో జగన్ కు.. నాకు సమాన భాగం ఉండాలని తండ్రి వైఎస్సార్ నిర్ణయించారు. తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ నుంచి ఫోన్లు వస్తున్నాయి. నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది. అన్ని కథలూ చూస్తా. వైసీపీని అధికారంలోకి తేవటానికి 3200కి.మీ. పాదయాత్ర చేశా. వాస్తవాల్ని మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తోంది. వైసీపీ నేతలు ఏం చేసినా.. సాక్షి పత్రిక ఏం రాసినా భయపడే ప్రసక్తే లేదు. వెనక్కి తగ్గేదీ లేదు. సాక్షి సంస్థలో సగం వాటా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

షర్మిల మాటల్ని జాగ్రత్తగా చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది. సాంకేతికంగా ఆమెకు సాక్షి సంస్థలో ఎలాంటి హక్కు లేదన్న విషయం అర్థమవుతుంది. తన తండ్రి ఆస్తిలో సగాన్ని తనకు ఇవ్వాలని కోరారని.. ఆ అభిలాషను చెప్పిన షర్మిల ఒక విషయాన్ని మిస్ అయ్యారు. వైఎస్ నిజంగానే అనుకుంటే.. ఇంతకాలం రాని వాటా వ్యవహారం ఇప్పుడే ఎందుకు వచ్చినట్లు? అన్నది ప్రశ్న. సాక్షిలో సగం వాటా అన్నది మాట్లాడుకోవటానికి పనికి వస్తుందే తప్పించి..ఆమెకు ఎలాంటి అధికారిక హక్కు లేదన్నది మర్చిపోకూడదు.

సాక్షి పెట్టిన మొదట్నించి చూస్తే.. ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఆ మీడియా సంస్థకు వెళ్లి.. దాని రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొన్నది లేదు. అలాంటప్పుడు ఈ రోజున సగం వాటా ఉందన్న మాటలో అర్థం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యాఖ్యలతో తనను తాను చులకన చేసుకునే కన్నా.. కాసింత జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారు.