Begin typing your search above and press return to search.

షర్మిలకు రెండు కీలక పదవులు ఇవేనా?

వైఎస్‌ షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పగ్గాలు ఇస్తారని టాక్‌ నడుస్తోంది. లేదా ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించవచ్చని చర్చ జరుగుతోంది. అలాగే

By:  Tupaki Desk   |   3 Jan 2024 12:48 PM GMT
షర్మిలకు రెండు కీలక పదవులు ఇవేనా?
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. 2004–2014 వరకు వరుసగా పదేళ్లు అధికారంలో ఉండి కూడా 2014, 2019 ఎన్నికల్లో ఏపీలో ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయింది. ఈ నేపథ్యంలో పోయిన చోటే తిరిగి వెతుక్కోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఇందులో భాగంగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సర్వం సిద్ధమైంది. జనవరి 4న ఆమె న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరుల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. కాగా వైఎస్‌ షర్మిలతో పాటు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

వైఎస్‌ షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పగ్గాలు ఇస్తారని టాక్‌ నడుస్తోంది. లేదా ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించవచ్చని చర్చ జరుగుతోంది. అలాగే ఆమెను పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి లేదా జాతీయ కార్యవర్గంలోకి కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందాలనుకుంటున్న కాంగ్రెస్‌ అందుకు షర్మిలను అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించిందని అంటున్నారు. వైఎస్సార్‌ కుమార్తెగా ఆమెకున్న చరిష్మాతోపాటు మహిళకు ప్రాధాన్యం కల్పించామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. అంతేకాకుండా తమను దెబ్బతీసిన జగన్‌ ను అదే కంటితో పొడిపించొచ్చని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిలకు రెండు పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని అంటున్నారు. అందులోనూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిలకు మద్దతు ప్రకటించారు. ఆమె వెంట నడుస్తానన్నారు. ఆర్కేతో పాటు సీట్లు దక్కని పలువురు కాంగ్రెస్‌ లో చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో దివంగత సీఎం వైఎస్సార్‌ కుమార్తెగా షర్మిలకున్న క్రేజును వాడుకోవాలని భావిస్తోంది.

కాగా షర్మిల వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు. అలాగే తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె అయిన డాక్టర్‌ సునీతను కడప లోక్‌ సభా స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయించవచ్చని చెబుతున్నారు. తద్వారా వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి చెక్‌ పెట్టొచ్చని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం కడప ఎంపీగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే వీలుంది. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్‌ అధిష్టానం ప్రోత్సాహంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగొచ్చని టాక్‌ నడుస్తోంది.