'అటు-ఇటు కాని'.. షర్మిల రాజకీయం!: సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
మా నాయకురాలి రాజకీయాలు చూస్తే.. మాకు తల బొప్పి కడుతోంది!.'' - ఇదీ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తాజాగా చేసిన కామెంట్.
By: Tupaki Desk | 27 April 2025 10:04 AM IST''కొద్ది సేపు అన్నను తిడుతుంది.. మరికొంత సేపు చంద్రబాబును తిడుతుంది. మా నాయకురాలి రాజకీయాలు చూస్తే.. మాకు తల బొప్పి కడుతోంది!.'' - ఇదీ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తాజాగా చేసిన కామెంట్. రాష్ట్రంలో పార్టీ ఎదగా లని.. పార్టీ పుంజుకోవాలని.. ఆశించిన కాంగ్రెస్ అధిష్టానం.. వైఎస్ కుమార్తెగా ట్యాగ్ ఉన్న షర్మిలకు పగ్గాలు ఇచ్చిందని సదరు నేత చెప్పారు. అయితే.. ఆమె ఈ కీలక విషయాన్ని విస్మరించారని తెలిపారు. ఎప్పుడు ఎటు వైపు మొగ్గు తున్నారో.. ఎలాంటి రాజకీయం చేస్తున్నారో.. ఆమెకైనా తెలుసా? అనేది తమ అభిప్రాయమన్నారు.
ఒకప్పుడు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తును జగన్ హయాంలో తగ్గించి.. 45 నుంచి 41 మీటర్లకు కుదించారు. కానీ, ఇప్పుడు చంద్రబాబుదే నెపం అన్నట్టుగా షర్మిల వ్యాఖ్యానించారు. దీనిని ప్రస్తావిస్తూ.. కేంద్రంలో మంత్రిగా కూడా చేసిన ఎస్సీ నాయకుడు .. ఒకరు స్పందించారు. ''మాకు దశ-దిశ లేకుండా పోయింది. ఎవరు చెప్పాలి? ఏం చెప్పాలి. ఆమె గారి ఇష్టానికి పార్టీని వదిలేశారు. ఇప్పుడు చేతులు కాలుతున్నాయి అనేకన్నా.. పెనం పైనుంచి పొయ్యిలోకి పడ్డట్టుగా మా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు.. ఆమెను(షర్మిల) ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. మేం ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాం'' అని అన్నారు.
అంతకాదు.. ద్వంద్వ రాజకీయాలు చేస్తే.. ప్రజలు హర్షించరని సదరు నేత చెప్పుకొచ్చారు. ఈయన గత ఏడాది ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేశారు. ఓడిపోయారు. అయితే.. షర్మిల విధానాలపై తరచుగా ఆయన అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నారు. అధిష్టానం వద్ద మంచి ర్యాపో ఉన్నప్పటికీ.. వైఎస్పై ఉన్న అభిమానంతో ఫిర్యాదులు చేయడం లేదని సహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, ఇలా చేస్తూ.. పోతే.. అటు ఇటు కాని రాజకీయాలు చేస్తే.. ఆమెతోపాటు.. తమకు కూడా.. ఎలాంటి గౌరవం ఉండబోదని సదరు నేత వ్యాఖ్యానించడం గమనార్హం. మరి షర్మిల తన తీరును మార్చుకుంటారో..లేదో చూడాలి.
