'ఏక్షణమైన పేల్చేస్తాం'.. శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు?
అవును... శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
By: Tupaki Desk | 9 May 2025 8:42 PM ISTఓ పక్క భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్స్ ని ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రధానంగా విమానాశ్రయాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని సూచించింది. ఈ సమయంలో తాజాగా హైదరాబాద్ లోని శమ్షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది అని మీడియా లో వార్తలు వస్తున్నాయి .
అవును... శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో భాగంగా... విమానాశ్రయాన్ని ఏక్షణమైనా బాంబుతో పేల్చేస్తాం.. మీ ప్రభుత్వానికి చెప్పండి.. అని పాక్ స్లీపర్ సెల్స్ అంటూ మెయిల్ వచ్చిందని తెలుస్తోంది. ఈ బెదిరింపుల ఈ మెయిల్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పొర్ట్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఇందులో భాగంగా... అలర్ట్ అయిన సీ.ఐ.ఎస్.ఎఫ్. అధికారులు ఎయిర్ పోర్ట్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇదే సమయంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో ఎయిర్ పోర్ట్ అంతా జల్లెడపట్టారు. అయితే విమానాశ్రయంలో ఎలాంటి బాంబులు ఉన్నట్లు తేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే... ఈ మెయిల్ లో ప్రధానంగా దుండగులు.. "మీ ప్రభుత్వానికి చెప్పండి.. మేము పాక్ స్లీపర్ సెల్స్.. ఏ క్షణమైనా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను పేల్చేస్తాం" అంటూ స్పష్టంగా పేర్కొన్నారు! మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ హై రిస్క్ జోన్ లో ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లోనూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 24 గంటలు డేగ కళ్లతో విమానాశ్రయానికి సీ.ఐ.ఎస్.ఎఫ్. బలగాలు భద్రత కల్పిస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు కనీసం 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు.