Begin typing your search above and press return to search.

చేసుకున్న వారికి చేసుకున్నంత... రాజు గారూ..!

ఇప్పుడు వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విష‌యంలో ఇదే జ‌రిగిందని వైసీపీ నాయ‌కులు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో న‌వ్వుకుంటున్నారు. రెండు విష‌యాల్లో సీదిరికి ఎఫెక్ట్ ప‌డింది.

By:  Tupaki Desk   |   27 May 2025 12:30 PM
చేసుకున్న వారికి చేసుకున్నంత... రాజు గారూ..!
X

రాజ‌కీయ‌మైనా.. వ్య‌క్తిగ‌త‌మైనా.. చేసుకున్న వారికి చేసుకున్నంత‌. మ‌నం గౌర‌వంగా ఉంటే.. ఎదుటి వారు కూడా గౌర‌వంగానే ఉంటారు. కానీ, మ‌న‌కు అధికారం ఉంద‌నో.. ఎమ్మెల్యేగా గెలిచామ‌నో అహంకారం ప్ర‌ద ర్శిస్తే.. ఈ ప‌ద‌వులు.. విజ‌యాలు ఎల్ల‌కాలం కొన‌సాగ‌వు. ఎప్పుడో ఒక‌ప్పుడు రివ‌ర్స్ అవుతుంది. ఇప్పుడు వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విష‌యంలో ఇదే జ‌రిగిందని వైసీపీ నాయ‌కులు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో న‌వ్వుకుంటున్నారు. రెండు విష‌యాల్లో సీదిరికి ఎఫెక్ట్ ప‌డింది.

1) పోలీసులు ఆయ‌న‌ను దూషించ‌డం. 2) సొంత పార్టీ నాయ‌కులు ఆయ‌న‌కు అండ‌గా నిల‌వ‌క‌పోవ‌డం. ఈ రెండు అంశాలు కూడా ఒకే రోజు చోటు చేసుకున్నాయి. ఓ ఘ‌ట‌న విష‌యంపై వ‌జ్ర‌పు కొత్తూరులోని వైసీపీ కార్య‌క‌ర్త‌లు సీదిరిని పిలిచారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ‌పై దాడి చేశార‌ని.. కానీ, పోలీసులు కేసు పెట్ట‌డం లేద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంపై పోలీసుల‌తో చ‌ర్చించే స‌మ‌యంలో సీదిరి తొలుత నోరు జారారు. దీంతో సీఐ తిరుప‌తి రావు కూడా దూష‌ణ‌ల‌కు దిగాడు.

దీంతో సీదిరి అప్ప‌ల‌రాజు నిర్ఘాంత పోయారు. ఇదిలా వుంటే.. ఈ ఘ‌ట‌న అనంత‌రం.. వ‌జ్ర‌పు కొత్తూరులో నిర‌స‌న‌ల‌కు సీదిరి పిలుపునిచ్చారు. కానీ, వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ స్పందించ‌లేదు. దీంతో సీదిరి కి అదే రోజు మ‌రో షాక్ త‌గిలిన‌ట్టు అయింది. అయితే.. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. అస‌లు చ‌ర్చ ఏంటంటే.. గ‌తంలో త‌మ‌ను కూడా సీదిరి ఇలానే దూషించారంటూ.. పోలీసులు చెబుతున్నారు. గ‌తంలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు.. సీదిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆయ‌న‌ను మాత్ర‌మే ఎలో చేస్తామ‌నిపోలీసులు చెప్పారు.

కానీ, త‌న ప‌రివారాన్నికూడా జ‌గ‌న్ స‌భ‌కు అనుమ‌తించాల‌ని కోర‌డంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీదిరి పోలీసుల‌పై విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు అదే రివ‌ర్స్ అయింద‌ని అంటున్నారు. ఇక‌, వైసీపీ నాయ కులు.. గ‌తంలో సీదిరి మంత్రిగా ఉన్న‌ప్పుడు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు వ‌చ్చారు. కానీ, ఆయ‌న వారిని ప‌ట్టించుకోకుండా.. తృణీక‌రించారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అంటూ.. ఆయ‌న నిర‌స‌న‌కు పిలుపునిచ్చినా.. వారు ప‌ట్టించుకోలేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు.. చేసుకున్న వారికి చేసుకున్నంత... రాజుగారూ! అంటున్నారు.