సత్తెనపల్లి సీటుపై హాట్ డిబేట్.. ఏం జరుగుతోంది.. ?
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ విజయం దక్కించుకున్నారు.
By: Garuda Media | 2 Jun 2026 6:00 AM ISTపల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గంపై టీడీపీలో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ఇటీవల నిర్వహించిన మహానాడుకు కన్నా పెద్దగా మనసు పెట్టలేదని అంటున్నారు. దీనికి తోడు ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక, ఆ తర్వాత.. ఆయన కీలక సమయాల్లోనూ.. పార్టీకి. ప్రభుత్వానికి కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
దీనికి తోడు వయసు నేపథ్యంలో గతంలో ఉన్నంత చురుకుగా కన్నా రాజకీయాలు చేయలేకపోతున్నారు. సీనియర్ నాయకుడు, సుదీర్ఘంగా 30 ఏళ్లకుపైనే రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు యాక్టివిటీ పెంచే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం టికెట్ను వచ్చే ఎన్నికల్లో కోడెల కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల జరిగిన మహానాడుకు.. కోడెల కుమారుడు శివరామకృష్ణ ఆన్లైన్లో పాల్గొన్నారు.
దీనివెనుక.. ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధించి రంగం రెడీ చేసుకుంటున్నారన్న చర్చ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాలపునర్విభజన జరిగితే.. ఖచ్చితంగా కోడెలకు టికెట్ వస్తుం దని మొన్నటి వరకు చర్చ జరిగినా.. ఇప్పుడు సత్తెనపల్లి నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. పైగా.. కోడెల తాలూకు సెంటిమెంటు కనిపిస్తుండడం.. పార్టీలోనూ మార్పు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కోడెల వారసుడికి ఆశలు పెరుగుతున్నాయి.
మహానాడు అనంతరం.. శివరామకృష్ణ.. గుంటూరులో మంత్రి నారా లోకేష్ను కలుసుకున్నారని తెలిసింది. దీనికి కూడా అదే నేపథ్యం ఉందన్న చర్చ ఉంది. వచ్చే సారైనా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేయడంతో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నారా లోకేష్ చెప్పారని సమాచారం. ఇలా.. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న మార్పులు.. చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. మార్పు దిశగా పార్టీ అడుగులు వేస్తున్న విషయం స్పష్టమవుతోంది. అయితే.. ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారన్నది చూడాలి.
