Begin typing your search above and press return to search.

కుభేరుడు వారెన్ బ‌ఫెట్ క‌రెన్సీ దాప‌రికం వెన‌క టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన రాబ‌ర్ట్ కియోసాకి!

క‌రోనా క్రైసిస్ త‌ర్వాత అతి పెద్ద క్రైసిస్ ఆయిల్ క్రైసిస్. ఇది ఏఐ (కృత్రిమ మేథ‌స్సు) క్రైసిస్ ని మించిపోయి ప్ర‌పంచ దేశాల‌ ప్ర‌జ‌ల్ని భ‌య‌పెడుతోంది.

By:  Sivaji Kontham   |   29 April 2026 12:41 PM IST
కుభేరుడు వారెన్ బ‌ఫెట్ క‌రెన్సీ దాప‌రికం వెన‌క టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన రాబ‌ర్ట్ కియోసాకి!
X

క‌రోనా క్రైసిస్ త‌ర్వాత అతి పెద్ద క్రైసిస్ ఆయిల్ క్రైసిస్. ఇది ఏఐ (కృత్రిమ మేథ‌స్సు) క్రైసిస్ ని మించిపోయి ప్ర‌పంచ దేశాల‌ ప్ర‌జ‌ల్ని భ‌య‌పెడుతోంది. ఇరాన్ తో ఇజ్రాయేల్- అమెరికా వార్ .. హ‌ర్మూజ్ దిగ్భంధ‌నం వంటి అంశాలు ఇప్ప‌టికే చాలా దేశాల్ని ఒణికిస్తున్నాయి. దీనికి తోడు వ‌రుస పెట్టి యుద్ధాలు.. 150 ఏళ్ల నాటి క‌రువు కాట‌కం 2026ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నాయ‌నే క‌థ‌నాలొస్తున్నాయి. భ‌గ‌భ‌గ మండించే ఎల్ నినో ప్ర‌భావంతో ప్రపంచ‌వ్యాప్తంగా పంట‌లు పండే ప‌రిస్థితి కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. ఒక ర‌కంగా క‌ళియుగాంతానికి స‌మ‌య‌మాస‌న్న‌మైంద‌ని అనుకోవ‌చ్చు.

కార‌ణం ఏదైనా ఈ ప్ర‌పంంచం భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోంది? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఇప్పుడు ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, `రిచ్ డాడ్ పూర్ డాడ్` రచయిత రాబర్ట్ కియోసాకి 2026లో ఒణించ‌బోతున్న‌ ఆర్థిక సంక్షోభం గురించి చేసిన హెచ్చరించ‌డం భ‌య‌పెడుతోంది. ముంచుకొస్తున్న ముప్పును పూర్తిగా విశ్లేషిస్తే...

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక పెను విపత్తు దిశగా అడుగులు వేస్తోంద‌ని ఆర్థిక విశ్లేషకుడు రాబర్ట్ కియోసాకి అంచ‌నా వేస్తున్నారు. 2026 నాటికి ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తున్నాయి. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా.. నోస్ట్రాడమస్ - ఎడ్గార్ కేస్ వంటి భవిష్యత్తు వాదుల అంచనాలను కూడా ప్రస్తావిస్తూ.. రానున్న‌ కాలం అత్యంత క్లిష్టంగా ఉండబోతోందని ఆయన విశ్లేషించారు.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు సామాన్యమైనవి కావు. కరోనా సంక్షోభం తర్వాత ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌కుండా యుద్ధాలు వెంటాడుతున్నాయి. అంతకంటే భయంకరమైన ఆయిల్ క్రైసిస్ ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. దీనికి తోడు 150 ఏళ్ల నాటి కరువు కాటకాలు మళ్లీ పునరావృతమవుతాయనే వార్తలు.. ఎల్ నినో ప్రభావంతో పడిపోతున్న వ్యవసాయ ఉత్పాదకత వెరసి 2026ను ఒక గండంలా మార్చబోతున్నాయని కియోసాకి అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ అనుసరిస్తున్న వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కియోసాకి బయటపెట్టారు. బఫెట్ ప్రస్తుతం తన వద్ద భారీగా నగదు నిల్వలను ఎందుకు దాచుకుంటున్నారో వివరిస్తూ.. అది ముంచుకొస్తున్న‌ మార్కెట్ పతనం నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌ కోసమేనని తేల్చి చెప్పారు. మార్కెట్లు కుప్పకూలినప్పుడు ఆస్తుల ధరలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంటాయని.. ఆ సమయంలో తక్కువ ధరకే ఎడాపెడా నాణ్యమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకే బఫెట్ ఈ `కరెన్సీ దాపరికం` చేస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.

పెట్టుబడిదారులకు కియోసాకి ఇస్తున్న అతిపెద్ద సలహా ఏంటంటే.. ఇకపై పేపర్ ఆస్తులైన బాండ్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఎస్‌& పి 500 వంటి సూచీలపై నమ్మకం వదిలేయాల‌ని బ‌ఫెట్ సూచిస్తున్నారు. ఇవన్నీ కేంద్ర బ్యాంకుల నియంత్రణలో ఉంటాయని.. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెన్సీని ముద్రించి వాటి విలువను తగ్గించగలదని ఆయన హెచ్చరించారు. అందుకే ప్రభుత్వాలు సృష్టించలేని లేదా నియంత్రించలేని `నిజమైన ఆస్తుల` వైపు పెట్టుబ‌డుల‌ను మ‌ళ్లించ‌డం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం.

సురక్షితమైన పెట్టుబడుల జాబితాలో చమురు నిల్వలు, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి వాటికి ఆయన అగ్రతాంబూలం ఇచ్చారు. అలాగే డిజిటల్ యుగంలో బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టోకరెన్సీలు ఆర్థిక రక్షణ కవచాలుగా పనిచేస్తాయని ఆయన నమ్ముతున్నారు. వీటితో పాటు ఆహార వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా మేలని సూచించారు. `బై అండ్ హోల్డ్` వ్యూహాన్ని అనుసరిస్తూ... మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఆస్తులను కూడబెట్టడమే దీర్ఘకాలంలో లాభదాయకమని కియోసాకి పేర్కొన్నారు.

సంక్షోభం అనేది సామాన్యులకు భయాన్ని కలిగిస్తే.. తెలివైన ఇన్వెస్టర్లకు అది గొప్ప అవకాశమని కియోసాకి గుర్తు చేశారు. మార్కెట్ మార్పుల విష‌యంలో అంత‌గా ప‌రిశీల‌న లేని ముందు జాగ్ర‌త్త‌లు తెలియ‌ని వారు తీవ్రంగా నష్టపోతారని.. ముందస్తుగా సిద్ధమయ్యేవారు ఈ సంక్షోభంలోనే మరింత ధనవంతులుగా మారుతారని ఆయన స్పష్టం చేశారు. 2026 నాటికి ఆర్థిక వినాశనం సంభవిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే.. ముందస్తు జాగ్రత్తగా స్థిరాస్తులను సమకూర్చుకోవడం మాత్రం మేలనేది ఆయన మాటల సారాంశం. కియోసాకి విశ్లేష‌ణ చాలా మంది పెట్టుబ‌డిదారుల‌కు మేల్కొలుపుగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.