Begin typing your search above and press return to search.

దేశంలోనే రిచెస్ట్‌ ఎంపీలు.. ఆ ఇద్దరు తెలుగువారు వీరే!

అత్యధిక ధనవంతులైన రాజ్యసభ ఎంపీలు మన తెలుగువారే కావడం విశేషం.

By:  Tupaki Desk   |   2 March 2024 9:13 AM GMT
దేశంలోనే రిచెస్ట్‌ ఎంపీలు.. ఆ ఇద్దరు తెలుగువారు వీరే!
X

దేశంలో రిచెస్ట్‌ ఎంపీలు, అత్యధిక కేసులు ఉన్న ఎంపీలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజాగా ఆసక్తికర నివేదికను వెల్లడించింది. అత్యధిక ధనవంతులైన రాజ్యసభ ఎంపీలు మన తెలుగువారే కావడం విశేషం. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కు చెందిన బండి పార్థసారధి రెడ్డి రూ.5300 కోట్ల ఆస్తులతో దేశంలోనే అందరికంటే ధనవంతుడైన ఎంపీగా రికార్డు సృష్టించారు. అలాగే వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రూ.2577 కోట్ల ఆస్తులతో దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన రాజ్యసభ ఎంపీగా నిలిచారు.

బండి పార్థసారధి రెడ్డి హెటిరో గ్రూప్‌ కు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూప్‌ కు చైర్మన్లుగా ఉన్నారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీలపై తాజాగా ఏడీఆర్‌ తన నివేదికను వెలువరించింది.

రాజ్యసభలో సిట్టింగ్‌ ఎంపీలుగా ఉన్న ఒక్కో ఎంపీకి సగటున రూ.87.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్‌ వెల్లడించింది. 90 మంది ఎంపీలున్న బీజేపీకి చెందిన 9 మంది, కాంగ్రెస్‌ నుంచి 4, వైసీపీ లో ఐదుగురు, ఆప్, బీఆర్‌ఎస్, ఆర్జేడీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు రూ.100 కోట్లకుపైనే ఆస్తులు కలిగి ఉన్నారని తెలిపింది.

పార్టీల వారీగా చూస్తే బీజేపీ రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.3,360 కోట్లు, కాంగ్రెస్‌ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.1,139 కోట్లు, వైసీపీ ఎంపీల ఆస్తులు రూ.3,934 కోట్లు, బీఆర్‌ఎస్‌ ఎంపీల ఆస్తులు రూ.5,534 కోట్లు, ఆప్‌ ఎంపీల ఆస్తులు రూ.1,148 కోట్లుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. రాజ్యసభలో సిట్టింగ్‌ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.19,602 కోట్లుగా ఉన్నాయని వివరించింది.

కాగా రాజ్యసభ సిట్టింగ్‌ ఎంపీల్లో 33 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. 225 మంది రాజ్యసభ సిట్టింగ్‌ ఎంపీల డేటాను విశ్లేషించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేసింది.

ఇద్దరు ఎంపీలపై హత్య, నలుగురు ఎంపీలపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ తెలిపింది. 225 మంది రాజ్యసభ సిట్టింగ్‌ ఎంపీలలో 75 (33 శాతం) మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, 40 (18 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌ లో పేర్కొన్నారని ఏడీఆర్‌ తన నివేదికలో వెల్లడించింది. క్రిమినల్‌ కేసులున్న వారిలో బీజేపీ సభ్యులే ఎక్కువగా ఉండటం గమనార్హం. అలాగే కాంగ్రెస్‌కు చెందిన 28 మంది ఎంపీలలో 50 శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయని తెలిపింది.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ కు చెందిన 13 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు (38 శాతం), ఆర్జేడీ నుంచి ఆరుగురిలో నలుగురు (67 శాతం), సీపీఐ(ఎం) నుంచి ఐదుగురు ఎంపీల్లో నలుగురు (80 శాతం) నేర చరిత్ర కలిగినవారు ఉన్నారని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది.

అదేవిధంగా ఆప్‌ కి చెందిన 10 మంది ఎంపీలలో 30 శాతం మంది, వైసీపీకి చెందిన చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులలో నలుగురు (36 శాతం), డీఎంకే 10 మంది ఎంపీల్లో ఇద్దరు (20 శాతం) పై క్రిమినల్‌ కేసులున్నట్లు ఏడీఆర్‌ విశ్లేషించింది.

కాగా ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఒక స్థానం, జమ్ము కశ్మీర్‌ నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే మరో ముగ్గురు ఎంపీల అఫిడవిట్‌ లు అందుబాటులో లేకపోవడంతో ఏడీఆర్‌ వారి డేటాను విశ్లేషించలేదు.