పరీక్షలలో AI పరికరం ఉపయోగించాలన్న ఆర్జీవీ
విద్యారంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావాన్ని విశ్లేషించేందుకు యునెస్కో వంటి అంతర్జాతీయ వ్యవస్థ సైతం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 15 Nov 2025 1:00 PM ISTవిద్యారంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావాన్ని విశ్లేషించేందుకు యునెస్కో వంటి అంతర్జాతీయ వ్యవస్థ సైతం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ లో విద్యారంగంలో ఎలాంటి పెనుమార్పులు చేయాలో సూచనలు అందించేందుకు యునెస్కో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు, మంత్రులు లేదా కాలం చెల్లిన విద్యాశాఖ బోర్డులు దీనిని తెలుసుకునే వరకు ఏఐ విప్లవం వేచి ఉండదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధి చెందని ఆలోచనలు ఏఐ తుడిచివేస్తుందని, దీనికి మొదటి బాధితులు విద్యార్థులేనని హెచ్చరించారు.
ఏఐ ప్రపంచంలో మన ప్రస్తుత విద్యా వ్యవస్థకు కట్టుబడి ఉండటం సాంప్రదాయం కాదు .. ఇది అమాయకత్వం .. తిరోగమనం కూడా.. ``విద్య చనిపోయింది. హేయ్... విద్యార్థులు మేల్కొని విద్య మరణాన్ని సెలబ్రేట్ చేసుకోండి`` అంటూ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో టీజ్ చేసారు. ఏఐ విస్పోటనం ముందు ఏదీ నిలబడదని ఆర్జీవీ బలంగా వాదిస్తున్నారు.
ఏఐ టూల్స్ ని విద్యలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి కానీ, సబ్జెక్టును బట్టీ కొట్టి చదివే విధానం కొనసాగించాలని అనుకోవడం మూర్ఖత్వమని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఒక ఉదాహరణగా వైద్య విద్యా కోర్సును పరిశీలిస్తే... ఒక వైద్య విద్యార్థి శరీరం గురించి నేర్చుకోవడానికి ఐదు సంవత్సరాలు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి రెండు సంవత్సరాలు.. స్పెషలైజేషన్ చేయడానికి మరో రెండు మూడు సంవత్సరాలు గడుపుతాడు. అంటే కండరాలు, నరాలు, అవయవాలు, వాటి విధులు, ప్రోటోకాల్లను గుర్తుంచుకోవడానికి ఒక దశాబ్దం పడుతుంది. చివరకు ఒకరి శరీరంలో ఏమి తప్పు జరిగిందో నిర్ధారించడానికి తగిన చికిత్సను అందించడానికి ఇదంతా చేయాలి.
కానీ ఇప్పుడు ఒక AI లక్షలాది వైద్య కేసులను చదివేస్తూ, రోగి డేటాను స్కాన్ చేసి, రోగ నిర్ధారణను వేగంగా మరింత కచ్చితంగా పక్షపాతం లేకుండా ఇవ్వగలిగితే ..చివరిగా చికిత్సను కూడా సూచించగలిగితే.. ఒక యంత్రం 10 సెకన్లలో చేయగలిగే పని కోసం మనిషి 10 సంవత్సరాలు వృధా చేయడం దేనికి? అని ఆర్జీవీ ప్రశ్నించారు. వైద్య కళాశాలల్లో చేరే ప్రస్తుత పేద విద్యార్థులందరి గురించి ఆలోచిస్తే నాకు బాధగా ఉంది, ఎందుకంటే ఇవన్నీ పూర్తి చేసే సమయానికి, వారికి ఏమీ మిగిలి ఉండదు! అని ఒక ప్రముఖ వైద్యుడు చెప్పినట్లు ఆర్జీవీ ఉటంకించారు. ఇదేమీ డిస్టోపియా కాదు.. వాస్తవం. కేవలం వైద్య విద్యార్థులకే కాదు.. ఏ ఇతర కోర్సులకు అయినా ఇది వర్తిస్తుందని ఆర్జీవీ అన్నారు.
ఏఐ ప్రపంచంలో ఈ విద్యావ్యవస్థ పూర్తిగా వెనకబడిపోయిన సత్తుకాలంలో ఉందని విమర్శించారు ఆర్జీవీ. మనది జ్ఞాపకశక్తి ఆధారిత విద్యా వ్యవస్థ.. సమాచారం కొరత ఉన్న కాలం కోసం నిర్మించినది. కానీ మీకు ఏదైనా సమాచారాన్ని తక్షణమే ఇవ్వగల పరికరం అందుబాటులో ఉన్నప్పుడు గుర్తుంచుకోవడం అనేది జ్ఞానం కాదు.. అది పూర్తిగా మూర్ఖత్వం`` అని ఆర్జీవీ అన్నారు. విద్యలో రాడికల్ సంస్కరణలు ఇప్పుడు ఒక ఎంపిక కాదు.. భవిష్యత్తు మనుగడకు అవసరమని అన్నారు.
ఏఐ వేవ్ అనేది మార్పు కోరని వారిని తుడిచివేస్తుందని ఆర్జీవీ అన్నారు. నేటి విద్యార్థులు త్యాగాలు చేసే గొర్రెపిల్లలు.. వారి అజ్ఞాన తల్లిదండ్రులు మరింత అజ్ఞాన నిర్ణేతలుగా మారి క్రూరంగా మోసానికి గురవుతారు! అసలు ఉన్నాయో లేవో తెలీని ఉద్యోగాలకు గర్వంగా తమ పిల్లలను సిద్ధం చేస్తున్నారు! అని ఆర్జీవీ అన్నారు.
అంతేకాదు తక్షణ ప్రాతిపదికన తరగతి గదుల్లో, పరీక్షలలో AI సాధనాలను సమర్థవంతమైన సహాయకులుగా అనుమతించాలి. పాఠశాలలు విద్యను అందిస్తున్నట్లు నటించడం మానేయాలి. ఒక విద్యార్థి AIని ఎంత తెలివిగా, సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో మాత్రమే వారు పరీక్షించాలి. భవిష్యత్ ప్రశ్నపత్రాలు మీకు తెలిసిన వాటిని అడగకూడదు.. అవి మీరు AIని ఎంత వేగంగా, ఎంత లోతుగా, ఎంత వినూత్నంగా మీ కోసం పని చేయగలుగుతాయో ప్రశ్నలలో అడగాలి. ఎందుకంటే మేధావి ప్రతిదీ తెలిసినవాడు కాదు.. కానీ AIని సరైన ప్రశ్న ఎలా అడగాలో తెలిసినవాడు మేధావి! అని అన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి ఆర్జీవీ ఘాటు విమర్శలు చేసారు. మీ పాఠ్యపుస్తకాల కింద ఉన్న నేల వేగంగా కరిగిపోతోందని మీరు గ్రహించాలి. మీ డిగ్రీలు అవి ముద్రించిన కాగితం కంటే విలువైనవి కావు. మీ ప్రొఫెసర్లు చనిపోయిన వ్యవస్థ శిథిలాల నుండి మీకు బోధిస్తున్నారు. మీరు పాత పద్ధతిని నేర్చుకుంటూ ఉంటే, మీరు అంతరించిపోతారు. AI మిమ్మల్ని చంపదు.. అది మిమ్మల్ని విస్మరిస్తుంది. కాబట్టి మార్కుల కోసం చదువుకోవడం మానేసి ఏఐని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే అతి త్వరలో ఏఐని ఉపయోగించలేని వారు ఏఐ కారణంగా అలసిపోతారు! అని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
