Begin typing your search above and press return to search.

డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన చోటే ఓట్లు అడగండి!

తెలంగాణ‌లోని పేద‌ల క‌ల‌ల‌పై కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

By:  Tupaki Desk   |   12 March 2024 3:46 AM GMT
డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన చోటే ఓట్లు అడగండి!
X

తెలంగాణ‌లోని పేద‌ల క‌ల‌ల‌పై కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని.. పదేళ్లు చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్పి తెలంగా ణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్ పాలనను బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకు న్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఏ ఊరిలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో ఆ ఊర్లోనే ఆయన ఓట్లు అడగాలని.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేశారు.

పేదలకు ఇళ్లు ఇస్తామన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. ఢిల్లీలో రైతులను బలి తీసుకున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. 'ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కు ఓ బలమైన బంధం ఉంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాం. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం' అని రేవంత్ పేర్కొన్నారు.

90 రోజుల్లోనే హామీల అమ‌లు

రాష్ట్ర ప్రజల బాధ చూసే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని సీఎం రేవంత్‌ అన్నారు. 'ఇచ్చిన హమీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నాం. సొంతింటి కల సాకారం కోసం ప్రజలు పదేళ్లుగా ఎదురు చూశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకూ పట్టాలు ఇస్తాం. భద్రాచలం అభివృద్ధికి మా వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉంది.' అని పేర్కొన్నారు.

'రామయ్యను కేసీఆర్ మోసం చేశారు'

భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని.. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని.. పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేస్తే.. తాము పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని స్పష్టం చేశారు.