Begin typing your search above and press return to search.

లోక్ సభ ఎన్నికల ముందు రేవంత్ స్కెచ్ ఇదేనా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో గ్యారెంటీలు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Jan 2024 12:24 PM GMT
లోక్ సభ ఎన్నికల ముందు రేవంత్ స్కెచ్ ఇదేనా?
X

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో గ్యారెంటీలు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను తెరపైకి తెచ్చి వీజయం సాధించి కాంగ్రెస్.. తెలంగాణకు వచ్చేసరికి మరొకటి పెంచి ఆరు గ్యారెంటీలను తెరపైకి వచ్చింది.. అధికారంలోకి వచ్చింది. మరో రెండు మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

అవును... శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో 17 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో రేవంత్ ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో... గ్యారెంటీల అమలు విషయంలోనూ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. అలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

ఇందులో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం అమలును రు.10 లక్షలకు పెంచారు. ఇక మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలుకు రేవంత్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ నాలుగింటిలో ప్రధానంగా కీలకమైన రెండు హామీలను వీలైనంత తొందర్లో అమలుచేసేలా రేవంత్ స్కెచ్ వేశారని అంటున్నారు.

ఈ క్రమంలో... రైతులకు రు. 2 లక్షల వరకు రుణమాఫి, ఉచిత విద్యుత్ పథకాల అమలుపై రేవంత్ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లేలోపు ఈ రెండు హామీలనూ అమలుచేసేస్తే... ఇక తిరుగుతుండదని రేవంత్ భావిస్తున్నారని అంటున్నారు. దీనికోసం పెద్దలతో మాట్లాడుతున్నారని సమాచారం!

ఇదే సమయంలో రు. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మొదలుపెట్టేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇలా పార్లమెంటు ఎన్నికల్లోపు ఈ మూడు హామీలను అమల్లోకి తేవాలని రేవంత్ గట్టిగా ఫిక్సయ్యారని తెలుస్తుంది. కీలకంగా ఉన్న ఈ మూడు హామీలను కూడా అమల్లోకి తెచ్చేస్తే.. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు డోకా ఉండదని భావిస్తున్నారంట.

ఇప్పటికే రెండు హామీలు అమలైన నేపథ్యంలో.. లోక్ సభ ఎన్నికల లోపు మరో మూడు హామీలను అమలుచేసేస్తే ఇక తిరుగుండదని రేవంత్ భావిస్తున్నారని చెబుతుండగా... ఇది కచ్చితంగా ప్రతిపక్షాలకు షాకింగ్ ఇష్యూనే అని అంటున్నారు పరిశీలకులు!