ఫ్యూచర్ లేని వారే.. ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటరట: రేవంత్ రెడ్డి
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఫ్యూచర్ సిటీని నిర్మించి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచ ర్ సిటీ తెలంగాణకు మణిహారంగా.. అభివృద్ధికి ఆనవాలుగానిలుస్తుందని తెలిపారు.
By: Garuda Media | 18 Jun 2026 11:00 PM ISTఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఫ్యూచర్ సిటీని నిర్మించి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచ ర్ సిటీ తెలంగాణకు మణిహారంగా.. అభివృద్ధికి ఆనవాలుగానిలుస్తుందని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేని కొందరు.. అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ''ఫ్యూచర్ లేనివారే.. ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు రెడీగా ఉన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసులు వేస్తారు. ఎలాగైనా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. ఇది వారి వల్లకాదు. హరిహరాదులు అడ్డు వచ్చినా.. నిర్మించి తీరుతాం'' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజాగా గురువారం సాయంత్రం ఆయన.. గుర్రంగూడలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనం తరం.. నిర్వహించి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి చేయడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారని .. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. మూసీనదిని కాలుష్య రహితంగా చేయాలని నిర్ణయించగానే.. వారి కడుపులోని కాలుష్యాన్ని వెదజల్లుతున్నారని విమర్శించారు. మూసీ కాలుష్యం కంటే కూడా.. వారి కడుపులోనే కాలుష్యం ఎక్కువగా ఉందని దుయ్యబట్టారు. ప్రజలు తీర్పు ఇచ్చి.. ఫామ్ హౌస్కే పరిమితం చేసినా.. వారికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు.
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇది తెలంగాణకు అత్యంత కీలకమని తెలిపారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధితో తెలంగాణ సరికొత్త రూపం సంతరించుకుంటుందని.. ఇదే జరిగితే.. వారికి రాజకీయ భవితవ్యం ఉండద ని భావిస్తున్నారని.. అందుకే వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామ ని ప్రగల్భాలు పలుకుతున్న సిద్దిపేట నాయకుడు.. తన ఫ్యూచర్ను చూసుకోవాలని చురకలు అంటించారు. ఆయన సిద్దిపేట లో ఓడిపోయేందుకు రెడీగా ఉన్నాడని అన్నారు.
వాటికంటే ఎక్కువగా..
మూసీ నది ప్రక్షాళనను అత్యంత సమర్ధవంతంగా చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఎక్కడో గుజరాత్లో చేపట్టిన సబర్మతి, య మున, గంగల కంటే ఎక్కువగా దీనిని ప్రక్షాళన చేయనున్నామన్నారు. మూసి నది పరివాహక ప్రాంతంలోని 55 కిలో మీటర్ల పరిధిలో నందనవనం ఏర్పాటు దిశగా కార్యాచరణను సిద్ధం చేసినట్టు తెలిపారు. మూసీ నది ప్రక్షాళనను కూడా కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని బీఆర్ ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. అయినా.. ఈ ప్రభుత్వం చేయాల్సింది చేస్తుందని చెప్పారు.
