'సౌత్ కాండిడేట్లు వద్దు'..సొంత గడ్డపై వివక్ష.. ముంబై సంస్థ దుర్బుద్ధికి నిదర్శనం!
డేటాబేస్ నిర్వహణ, బ్యాకప్ రికవరీ, విపత్తు నిర్వహణ వ్యూహాలు వంటి నిర్దిష్ట నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను ఆ సంస్థ కోరుతోంది.
By: Tupaki Desk | 10 May 2025 12:30 PMదేశం కోసం సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడుతుంటే.. సొంత గడ్డపై ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయి. ముంబైకి చెందిన ఒక సంస్థ ఉద్యోగ ప్రకటనలో చేసిన పని తీవ్ర దుమారం రేపుతోంది. ‘సౌత్ కాండిడేట్లు వద్దు’ అంటూ బహిరంగంగా చెప్పడానికి ఆ సంస్థకు ఎంత ధైర్యం? కేవలం పురుష టెక్కీల కోసమే ఈ ఉద్యోగం అంటూ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేసిందో వివరంగా తెలసుకుందాం.
ముంబైకి చెందిన ఒక సంస్థ విఖ్రోలి ప్రాంతంలోని టెక్నికల్ ఉద్యోగం కోసం ప్రకటన రిలీజ్ చేసింది. అందులో దరఖాస్తుదారులు రెండు మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని, వెంటనే విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉండాలని, తప్పనిసరిగా ఆఫీసులో పనిచేయాలని పేర్కొంది. సెలక్షన్ ప్రాసెస్ లో వర్చువల్ ఇంటర్వ్యూ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందని కూడా తెలిపింది.
డేటాబేస్ నిర్వహణ, బ్యాకప్ రికవరీ, విపత్తు నిర్వహణ వ్యూహాలు వంటి నిర్దిష్ట నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను ఆ సంస్థ కోరుతోంది. అయితే, అందరినీ ఆగ్రహానికి గురిచేసిన విషయం ఏమిటంటే.. ప్రాంతం ఆధారంగా చూపిన వివక్ష.. మన భారతీయ సైన్యం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతుంటే, సొంత దేశంలోనే ఉత్తర, దక్షిణ ప్రాంతాల పేరుతో వివక్ష చూపడం అత్యంత బాధాకరం.
ఈ ఉద్యోగ ప్రకటన స్క్రీన్ షాట్లు, ఒక అభ్యర్థి తీవ్రమైన స్పందన వెంటనే ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. దక్షిణ భారతీయులు ఇతరులను మరింత ఆదరిస్తారని, అవమానం ఎదురైనా మర్యాదగా ఉంటారని ఆ అభ్యర్థి సంస్థ ప్రాంతీయ దురభిమానాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఈ పరిస్థితి ఆఫీసుల్లో వివక్ష, నియామకాల్లో ప్రాంతీయ దురభిమానం గురించిన చర్చను మళ్లీ తెర మీదకు తెచ్చింది.