Begin typing your search above and press return to search.

ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్‌కు భారీ మూల్యం.. 5 లక్షల ఫైన్ వేసిన రైల్వే

ప్రయాణికులకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతో రైల్వే వెంటనే స్పందించక తప్పలేదు. ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకుంది.

By:  Tupaki Desk   |   8 May 2025 9:57 AM
ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్‌కు భారీ మూల్యం.. 5 లక్షల ఫైన్ వేసిన రైల్వే
X

రైళ్లలో ఫుడ్ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని కంప్లైంట్ చేసిన ఒక ప్రయాణికుడి మీద క్యాటరింగ్ సిబ్బంది దాడి చేసిన విషయం వైరల్ అవుతుంది. ఈ విషయం పెద్ద గొడవ కావడంతో ఇండియన్ రైల్వే వెంటనే రంగంలోకి దిగింది. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామని చెప్పింది. అంతేకాదు, ఆ క్యాటరింగ్‌ వాళ్లకి ఏకంగా రూ. 5 లక్షలు ఫైన్ వేసింది. కథువా రైల్వే పోలీసులు ఆల్రెడీ వాళ్ల మీద కేసు పెట్టారు. ఈ కేసును చాలా జాగ్రత్తగా పరిశీలిస్తామని, దర్యాప్తులో తేలిన విషయాల ప్రకారం వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే తన ట్వీట్‌లో తేల్చి చెప్పింది.

అసలు ఏం జరిగిందంటే.. ఒక ప్రయాణికుడు రైలులో తినుబండారాలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని కంప్లైంట్ చేశాడు. అంతే ఆ క్యాటరింగ్ సిబ్బందికి కోపం వచ్చి ఆ ప్రయాణికుడి మీద చేయి చేసుకున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ప్రయాణికుల భద్రతకు, హక్కులకు రైల్వే ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్పడానికి ఈ చర్య ఒక ఉదాహరణ. ఈ ఘటన జరిగిన వెంటనే చాలా మంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రైల్వేను నిలదీశారు. ప్రయాణికులకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతో రైల్వే వెంటనే స్పందించక తప్పలేదు. ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకుంది.

రైల్వే వేసిన ఈ ఫైన్ చాలా పెద్ద మొత్తమే. రూ.5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి చూస్తే రైల్వే ఇలాంటి ఘటనలను ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, పోలీసులు కూడా కేసు నమోదు చేయడం వల్ల ఆ క్యాటరింగ్ సిబ్బందికి చట్టపరమైన ఇబ్బందులు కూడా తప్పవు. రైల్వే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతోంది. దర్యాప్తులో ఇంకా ఏమైనా విషయాలు బయటకొస్తాయో చూడాలి. ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారో, దీనికి అసలు కారణం ఏమిటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత రైల్వే మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండటానికి రైల్వే శాఖ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రయాణికుల భద్రత, వారి హక్కుల పరిరక్షణకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా సరే ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా, ఎక్కువ ధరలకు అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తానికి ఈ ఘటనలో రైల్వే తీసుకున్న తక్షణ చర్యలు ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటే అదే పదివేలు.