Begin typing your search above and press return to search.

రాహుల్ మళ్ళి మొదలు పెడుతూన్నాడు! అందుకోసమేనా?

దీంతో ఈ సారి అధికారం ఖాయమని పొలిటికల్ అనలసిస్ట్ ల సూచనలతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 6:34 AM GMT
రాహుల్ మళ్ళి మొదలు పెడుతూన్నాడు! అందుకోసమేనా?
X

పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ మరోసారి చేపట్టేందుకు పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్లుగా ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దేశంలో మోడీ హవా కొనసాగుతున్న వేళ చాకచక్యంగా ప్రజలకు మరింత దగ్గరైతే మోడీ హవాను కాంగ్రెస్ వైపు మళ్లించవచ్చని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దీంతో ఈ సారి అధికారం ఖాయమని పొలిటికల్ అనలసిస్ట్ ల సూచనలతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నాడు.

భారత్ జోడో యాత్ర నేపథ్యం

బీజేపీ ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు ఎంపీ, అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగింది. 2022, ఆగస్ట్ లో ఈ యాత్రపై పార్టీలో చర్చలు ప్రారంభమ్యాయి. 2022, సెప్టెంబర్ 7వ తేదీన యూపీఐలో భాగస్వామి అయిన డీఎంకే నేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించారు. ఐదు నెల్లలో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3,500 కిలో మీటర్లకు పైగా ఈ యాత్ర సాగింది. ప్రతీ రోజు ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు మధ్యహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రెండు దఫాలుగా ఈ యాత్రను చేపట్టారు. అంటే రోజుకు 22 నుంచి 23 కిలో మీటర్లు యాత్ర సాగింది.

మళ్లీ ప్రారంభించనున్న రాహుల్..

రాహుల్ భారత్ జోడో యాత్ర తర్వాత గతంలో కంటే కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు పెరిగిందని కొన్ని సర్వేలు సూచించాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా పని చేయడం మొదలు పెట్టారు. దీంతో పార్టీ బీజేపీకి ధీటుగా పని చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ యాత్ర చేపడితే మరింత ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారు రాహుల్ గాంధీ. అందుకే వచ్చే నెల (జనవరి) నుంచి రెండో విడుత యాత్ర చేపట్టాలని ప్రణాళికలు వేస్తున్నారు. ప్రస్తుతానికి రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. అయితే మొదటి విడుతలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు నడిచారు. అయితే.. ఈ సారి ఏప్రిల్ లేదంటే మేలో లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ఆ లోపే ముగించాలని చూస్తున్నారు. అందుకే దీన్ని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ యాత్ర గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా.. పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ సారి యాత్ర ఎంతో కొంత కలిసి వస్తుందని, అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు అధినాయకులు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది.