'ఉక్రెయిన్ అంతా మాదే'... పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... ఏళ్లు గడుస్తున్నా రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. ఈ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగడం, అవి సక్సెస్ అవ్వడం అనేది జరిగే పనిలా కనిపించడం లేదు.
By: Tupaki Desk | 21 Jun 2025 1:06 PM ISTసుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం అవిరామంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఒక రోజు ఉక్రెయిన్ ది పైచేయిగా ఉంటే.. మరో రోజు రష్యా పైచేయి సాధిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మాస్కో బలగాలు సుమీ ప్రాంతంలోని బఫర్ జోన్ లోకి చొచ్చుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏళ్లు గడుస్తున్నా రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. ఈ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగడం, అవి సక్సెస్ అవ్వడం అనేది జరిగే పనిలా కనిపించడం లేదు. అమెరికా ఆ దిశగా ప్రయత్నించినా.. అవి ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన పుతిన్.. తన దృష్టిలో ఉక్రెయిన్ అంతా తమదేనని అంటూ గట్టి హెచ్చరికలు చేశారు.
ఈ సందర్భంగా... సుదీర్ఘకాలంగా రష్యన్లు, ఉక్రెయిన్లు ఒకటే అని చెప్పిన పుతిన్.. దీన్నిబట్టి చూస్తే ఉక్రెయిన్ మొత్తం మాదే అని అన్నారు. అయినప్పటికీ కీవ్ సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని.. ఉక్రెయిన్ లొంగిపోవాలని తాము కోరుకోవట్లేదని తెలిపారు. అయితే.. వారు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను అంగీకరించాలని సూచించారు.
ఇదే సమయంలో... మాస్కో భౌగోళిక ప్రయోజనాలను గుర్తుంచుకోవాలని కోరిన పుతిన్.. నాటోలో చేరాలన్న ఆశను వదులుకోవాలని అన్నారు. ఈ సైనిక చర్య ఉక్రెయిన్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని.. అది మరింత దిగజారకముందే చర్చలకు రావాలని.. రష్యా సైనికుడు ఎక్కడ అడుగుపెడితే.. ఆ ప్రాంతం మాదే అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఇదే క్రమంలో... సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్ ను ఏర్పాటుచేయాలనుకుంటున్నట్లు తెలిపిన పుతిన్... సరిహద్దుల వెంట నిరంతరం షెల్లింగ్ కు పాల్పడుతూ ఉక్రెయిన్.. తమకు మరింత ముప్పు సృష్టిస్తున్నారని అన్నారు. సుమీ ప్రాంతంలో 10 కి.మీ. లోపలికి రష్యా బలగాలు వెళ్లాయని.. అయితే ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకోవడం తమ లక్ష్యం కాదని తెలిపారు.
అయితే, పరిస్థితి మరింత తీవ్రంగా మారితే మాత్రం.. దాన్ని స్వాధీనం చేసుకొనే అవకాశం లేకపోలేదని పుతిన్ స్పష్టం చేశారు.
