Begin typing your search above and press return to search.

ఏకంగా వాయుసేన రన్ వేనే అమ్మేశారు

1945 మార్చి 12న బ్రిటిష్‌ ప్రభుత్వం దీనిని రక్షణ అవసరాల కోసం స్వాధీనం చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 July 2025 3:00 AM IST
ఏకంగా వాయుసేన రన్ వేనే అమ్మేశారు
X

భారత వాయుసేనకు చెందిన కీలకమైన ఒక రన్‌వేను నకిలీ పత్రాలతో ఏకంగా విక్రయించిన ఘటన పంజాబ్‌ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ సరిహద్దులోని ఫిరోజ్‌పుర్‌ జిల్లాలో జరిగిన ఈ అక్రమ విక్రయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1962 భారత్‌-చైనా యుద్ధం, అలాగే 1965, 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన ఈ రన్‌వేను అక్రమార్కులు తమ సొంతంగా ప్రకటించుకుని అమ్మేయడం దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం కావడానికి దారితీసింది.

- తల్లీకొడుకుల పన్నాగం

ఫిరోజ్‌పుర్‌ జిల్లాలోని ఫట్టూవాలా గ్రామంలో ఉన్న ఈ రన్‌వే రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. 1945 మార్చి 12న బ్రిటిష్‌ ప్రభుత్వం దీనిని రక్షణ అవసరాల కోసం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ భూమి వాయుసేన ఆధీనంలోనే ఉంది. అయితే దుమిని వాలా గ్రామానికి చెందిన ఉషా అన్సాల్‌ అనే మహిళ, ఆమె కుమారుడు నవీన్‌ చంద్‌ స్థానిక రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ భూమిని తమ స్వంతమని చూపించి 1997లో పలువురు వ్యక్తులకు అక్రమంగా విక్రయించారు.

-అధికారుల నిర్లక్ష్యం.. హైకోర్టు జోక్యం

ఈ అక్రమ వ్యవహారం గురించి విశ్రాంత రెవెన్యూ అధికారి నిషాన్‌సింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చినా, ఏళ్ల తరబడి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2021లో హల్వార ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కమాండెంట్‌, ఫిరోజ్‌పుర్‌ కమిషనర్‌కు లేఖలు పంపినా సమస్య పరిష్కారం కాలేదు. చివరికి నిషాన్‌సింగ్‌ పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ విచారణలో 1997లో జరిగిన అమ్మకాల డీడ్లలో వాయుసేన పేరు ఎక్కడా లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో హైకోర్టు 2025 మేలో ఈ భూమిని తిరిగి రక్షణశాఖకు అప్పగించాలని ఆదేశించింది. విజిలెన్స్ బ్యూరో దర్యాప్తులో ఈ భూమి 1945 నుంచే వాయుసేన అధీనంలో ఉందని స్పష్టంగా నిర్ధారణ అయ్యింది.

- కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం

తాజాగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఉషా అన్సాల్‌, నవీన్‌ చంద్‌లను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. దేశ భద్రతకు సంబంధించిన ఆస్తులపై జరుగుతున్న ఈ తరహా అక్రమాలు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.