Begin typing your search above and press return to search.

జనసేన ఎపిసోడ్ : వెరీ సారీ అంటూ ప్రొఫెసర్ యూటర్న్!

ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కి మేధావిగా రాజకీయ విశ్లేషకుడిగా ఎంతో పేరు ఉంది.

By:  Satya P   |   22 May 2026 12:39 PM IST
జనసేన ఎపిసోడ్ : వెరీ సారీ అంటూ ప్రొఫెసర్ యూటర్న్!
X

ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కి మేధావిగా రాజకీయ విశ్లేషకుడిగా ఎంతో పేరు ఉంది. ఆయన గణాంకాలతో సహా మొత్తం అన్నింటికీ మీడియా డిబేట్లలో ముందు పెట్టి తన వాదనను బలంగా వినిపిస్తూంటారు. ఆయన మాగ్జిమం న్యూట్రల్ గా ఉండేలాగానే చూసుకుంటారు. ఆయన చేసే డిబేట్లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తెలుగు రాజకీయాల మీద మరీ ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ మీద ఎక్కువగా స్పందిస్తూ తనదైన రాజకీయ విశ్లేషణలు వినిపిస్తూంటారు. అయితే ప్రొఫెసర్ తొలిసారి తప్పులో కాలేశారా లేక ఏమి జరిగింది అన్నది తెలియదు కానీ ఫస్ట్ టైం ఆయన యూటర్న్ అయితే తీసుకున్నారు.

విశ్లేషణ మొత్తం వెనక్కి :

ఈ మధ్యన ఆయన ఒక మీడియా డిబేట్ లో జనసేన మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీయడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. లేటెస్ట్ గా ఆయన ఒక చానల్ డిబేట్ లో ఇదే ప్రశ్న యాంకర్ నుంచి రాగానే తాను జనసేన మీద చేసిన వ్యాఖ్యలు మొత్తం వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. తనను అలా ఉప సంహరించుకోమన్నది జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ డిమాండ్ కదా అంటూ ఆయన మీద గౌరవంతో తాను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. అది కూడా భేషరతుగా ఎలాంటి భేషజాలకు పోకుండా అని ఒత్తి పలుకుతూ ప్రొఫేసర్ ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. దాంతో ఇది కూడా సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అవుతోంది.

ఇంతకీ ఏమన్నారు :

జనసేన అధినేత పవన్ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఇద్దరూ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసినపుడు జరిగిన సంభాషణ గురించి నాగేశ్వర్ ఇటీవల డిబేట్ లో ఆ విషయాలు బయటపెట్టారు. ముగ్గురు కీలక నేతలు మాట్లాడుకున్నపుడు నాలుగవ వారికి ఆ విషయాలు తెలిసే అవకాశం లేదు. కానీ తనకు జనసేన కోర్ కమిటీ వర్గాల నుంచి తెలిసాయని చెబుతూ నాగేశ్వరి హోం మంత్రితో పవన్ జరిగిన సంభాషణ ఇదే అని చెప్పుకొచ్చారు. జగన్ ని జైలు పాలు చేయాలని పవన్ కోరారని, దానికి అమిత్ షా జగన్ లాంగ్ టెర్మ్ ఫ్రెండ్ అని ఇన్స్టంట్ మిత్రులు ఉండొచ్చు కానీ లాంగ్ టెర్మ్ మిత్రులను ఉంచుకోవడం రాజకీయాల్లో మంచిది అని సూచించినట్లుగా నాగేశ్వర్ విశ్లేషించారు. అంతే కాదు కేంద్రం అండదండలు జగన్ కి ఉన్నాయని అందువల్ల ఆయన్ని అరెస్ట్ చేయలేరని కూడా వ్యాఖ్యానించారు.

జనసేన ఫైర్ :

అయితే ఈ మొత్తం వ్యవహారంలో జనసేన టార్గెట్ అయింది. దాంతో ఆ పార్టీ నేతలు అంతా ప్రొఫెసర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కేసులు కూడా పెట్టేదాకా సీన్ క్రియేట్ అయింది. ఇక ప్రొఫెసర్ క్రెడిబిలిటీ దెబ్బ తిందని కూడా జనసేన నేతలు విమర్శించారు. ఆయన భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దాంతోనే ఇపుడు ప్రొఫేసర్ వెనక్కి తగ్గారు అన్న చర్చ అయితే ఉంది. కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పోలీస్ కేసు ని జనసేన లీగర్ సెల్ పెట్టడంతో కూడా వ్యవహారం సీరియస్ గా మారింది అని అంటున్నారు.

ప్రొఫెసర్ సారీ :

నిజానికి ఏ విషయం మీద అయినా ఆచీ తూచీ మాట్లాడే ప్రొఫెసర్ ఎందుకు ఇలా వ్యాఖ్యానించారు అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీ అధినేత జగన్ లాంగ్ టెర్మ్ మిత్రుడు అని ప్రొఫెసర్ చెప్పడం చంద్రబాబు షార్ట్ టెర్మ్ మిత్రుడు అనడం ఇవన్నీ అమిత్ షా పవన్ తో అన్నారని జనసేన కోర్ కమిటీ లీక్స్ అని ఆయన చెప్పినవి అబద్ధాలు అని జనసేన వర్గాలు మండిపోయాయి. అసలు జనసేనలో కోర్ కమిటీ వ్యవస్థనే లేదని నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. దాంతోనే ప్రొఫెసర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే రాజకీయాల్లో చూస్తే ఎవరి విశ్లెషణలు వారు చేస్తూ ఉంటారు జగన్ కి కేంద్ర బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని అందుకే ఆయన బెయిల్ వ్యవహారం కానీ కేసులు కానీ అలాగే ఉన్నాయని అంటూంటారు. అయితే ఇవన్నీ ఊహాగానాలే. వీటి మీద సాధికారికంగా మాట్లాడేందుకు ఎవరి వద్దా ఆధారాలు అయితే లేవు. ఇలాంటి ఊహాగానాల మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రమే కాదు చాలా మంది గతంలో విశ్లేషించారు. కానీ ఫలానా మీటింగ్ అంటూ ఏకంగా కేంద్ర హోం మంత్రినే తెచ్చి ఎక్కడో దానికి ముడి పెట్టి చెప్పడంతోనే ప్రొఫెసర్ ఇరుకున పడ్డారని అంటున్నారు.