ఆపరేషన్ సింధూర్ పై సెటైర్లా? ఐఎస్ఐ ఏజెంట్ కంటే ప్రకాష్ రాజ్ ప్రమాదకరం
సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అతను సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
By: Tupaki Desk | 2 Jun 2025 5:11 PM ISTసినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అతను సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ప్రత్యేకించి "ఒకే దేశం –ఒకే భర్త" అంటూ చేసిన పోస్ట్ పెద్ద దుమారమే రేపింది.
ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికి సిందూరం అందజేయాలన్న "ఆపరేషన్ సిందూర్" ప్రకటనపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా స్పందిస్తూ "ఒకే దేశం, ఒకే భర్త" అంటూ ఒక పోస్ట్ చేశారు. ఆపై "ఈ ముసలివాడిని నుంచి మహిళలు సిందూరం ఎందుకు తీసుకుంటారు?" అని మరో వ్యాఖ్య చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుబాష్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, "ఇవి ఐఎస్ఐ ఏజెంట్ మాటలకన్నా ప్రమాదకరంగా ఉన్నాయి. తెరపై విలువలు బోధించే వ్యక్తి తెర వెనక దురాచార పాత్ర పోషిస్తున్నారు," అని ఆరోపించారు. ప్రకాష్ రాజ్ తాను చేసిన వ్యాఖ్యలపై పునరాలోచించి వాటిని వెనక్కి తీసుకోవాలని ఆయన హితవు పలికారు.
అలాగే "భారతీయ మహిళలను అవమానించడమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని తక్కువచేసే ప్రయత్నం ఇది. ఆయన తన తల్లి, సోదరి ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకోవాలి," అని హెచ్చరించారు.
- ఆపరేషన్ సిందూర్ గురించి:
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించగా, దీని ప్రతీకారంగా భారత్ మే 7న "ఆపరేషన్ సిందూర్"ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి.
ప్రధానంగా కోట్లి, బహావల్పూర్, ముజఫ్ఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్కి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నప్పటికీ, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు దానిని తక్కువచేసేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
