'చరిత్ర' బోధపడని బీఆర్ఎస్..!
అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాకముందు.. అధికారం పోయిన తర్వాత.. పోకముందు.. రాజకీయ పార్టీల నాయకులు చేసే కామెంట్లకు ప్రాధాన్యం ఉంటుంది.
By: Garuda Media | 27 May 2026 12:00 AM ISTఅధికారంలోకి వచ్చిన తర్వాత.. రాకముందు.. అధికారం పోయిన తర్వాత.. పోకముందు.. రాజకీయ పార్టీల నాయకులు చేసే కామెంట్లకు ప్రాధాన్యం ఉంటుంది. అస్సలు ఇప్పటి వరకు అధికారంలోకి రాని పార్టీ ఏమైనా చెప్పినా.. ప్రజలు విశ్వసించేందుకు అవకాశం ఉంటుంది. కానీ.. పదేళ్లు, పదిహేనేళ్లు అధికారంలో ఉన్నవారు.. ప్రజలకు చెబుతున్న మాటలు.. ఇస్తున్న వాగ్దానాలను.. ఏమేరకు ప్రజలు విశ్వసిస్తున్నారన్నది సందహమే.
ఎందుకంటే.. నాయకుల కంటే ముందు.. నేడు సోషల్ మీడియా జనాల మధ్యకువెళ్లిపోతోంది. దీంతో ఒకసారి అధికారం వెలగబెట్టిన తర్వాత.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నాయకులు చేస్తున్న వాగ్దానాలపై జనాలు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణం.. ఇదే!. 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ.. మహిళలను గాలికి వదిలేశారు. కానీ, ఇటీవల ఎన్నికల్లో వారిని మెప్పించే ప్రయత్నం చేసి.. 1500 నెల నెలా ఇస్తామన్నారు. పేదరికాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్నారు. కానీ, ప్రజలు నమ్మలేదు. దీనికి కారణం.. ''అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలే!'' .
ఈ సూత్రమే తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే.. ఎంతైనా తెలంగా ణ ప్రజలు కూడా చైతన్యవంతులే కదా!!. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్కు రైతుల కష్టాలు కనిపించాయా? అంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో సచివాలయానికి కూత వేటు దూరంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని నాడు సీఎం కేసీఆర్ ఎలా ట్రీట్ చేశారో తెలిసిందే.
పోనీ.. ఇంటింటికీ నీటిని ఇచ్చారా? అంటే.. ప్రశ్నార్థకమే. నాడు అధికారంలో ఉన్నప్పుడు రైతులు, నీళ్లు, నియామకాలు.. వంటివి చిన్న సమస్యలుగా మారాయి. కేంద్రంలో చక్రం తిప్పడం, జాతీయ రాజకీయాలు చేయడం.. వంటివి `పెద్దవి`గా మారాయి. కట్ చేస్తే.. ఇప్పుడు.. చరిత్ర మరిచిన బీఆర్ ఎస్.. ఇంటింటికీ 24 గంటలు నీటిని ఇస్తామని.. రైతులను కడుపులో పెట్టుకుంటామని చెబుతోంది. మంచిదే.. ఈ మార్పు కావాల్సిందే. కానీ.. ప్రజలు హర్షిస్తున్నారా? ఒక వేళజనాలు మరిచిపోయినా.. వారికి గుర్తు చేస్తున్న సోషల్ మీడియా ను ఎవరు తుడిచేయగలరు. సో.. చరిత్ర బోధ పడకపోతే.. ప్రజల సమస్యలు పట్టకపోతే.. ఇలానే ఉంటుంది. దీని నుంచి బీఆర్ ఎస్ పాఠాలు నేర్చుకుంటేనే.. భవిత ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
