Begin typing your search above and press return to search.

ఆపరేషన్‌ సిందూర్‌.. భారత్ బలమేంటో చూపించింది

గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవడియా వేదికగా జరిగిన ఐక్యతా దివస్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

By:  A.N.Kumar   |   31 Oct 2025 4:00 PM IST
ఆపరేషన్‌ సిందూర్‌.. భారత్ బలమేంటో చూపించింది
X

గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవడియా వేదికగా జరిగిన ఐక్యతా దివస్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వేడుకలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ, దేశ రాజకీయాలు, భద్రతా అంశాలపై కీలక సందేశాన్ని అందించారు.

* సర్దార్ పటేల్: చరిత్ర సృష్టించిన మహనీయుడు

మోదీ తన ప్రసంగాన్ని సర్దార్ పటేల్ దూరదృష్టిని కొనియాడుతూ ప్రారంభించారు. “చరిత్రను రాయడం కంటే దానిని సృష్టించడం ముఖ్యమని సర్దార్ పటేల్ విశ్వసించారు. స్వాతంత్ర్యం తర్వాత 550 సంస్థానాలను ఒకే జెండా కింద ఏకం చేయడం ఆయన అసాధారణ దార్శనికతకు నిదర్శనం” అని ప్రధాని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం పటేల్ చూపిన మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

* నక్సలిజం, విభజన వాదంపై పోరు

దేశ ఐక్యతకు సవాల్‌గా నిలుస్తున్న శక్తుల గురించి ప్రస్తావిస్తూ, “దేశంలో నక్సలిజం, విభజన వాద శక్తులు మన ఐక్యతకు సవాల్‌గా మారాయి. వాటిని సమూలంగా నిర్మూలించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని మోదీ అన్నారు. దేశ రక్షణ, భద్రత విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని ఆయన తేల్చి చెప్పారు.

*కశ్మీర్ & పాక్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు

కశ్మీర్‌ అంశంపై ప్రధాని మోదీ కాంగ్రెస్‌ విధానాలను తీవ్రంగా విమర్శించారు. “సర్దార్ పటేల్‌ కల కశ్మీర్‌ను సంపూర్ణంగా భారత్‌లో కలపడం. కానీ ఆ దృష్టిని కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. ఫలితంగా కశ్మీర్‌లో సమస్యలు పెరిగాయి. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచినప్పటికీ, అప్పటి ప్రభుత్వాలు దానికి తలవంచాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే "ఇప్పుడు భారత్‌ మారింది" అని నొక్కి చెబుతూ, “ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా మన సైన్యం శత్రువులకు భారత బలం ఏమిటో చూపించింది” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికగా నిలిచాయి.

* అక్రమ వలసదారులపై కఠిన చర్యలు

దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని మోదీ పేర్కొన్నారు. “దేశ రక్షణ కోసం ప్రతి పౌరుడు చొరబాటుదారులను తరిమికొట్టాలని సంకల్పించాలి” అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సర్దార్ పటేల్ జయంతి స్మారకంగా ప్రధాని ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. సైనిక పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఐక్యతా దివస్ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.