ప్రజలు మమ్మల్ని ఆదరించారు.. : మోడీ
ప్రజలు తమను ఆదరించారని.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఆశీర్వదించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.
By: Garuda Media | 10 Jun 2026 11:59 PM ISTప్రజలు తమను ఆదరించారని.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఆశీర్వదించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టి మోడీ.. బుధవారంతో 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇది దేశంలోనే సరికొత్త రికార్డు. ఇప్పటి వరకు తొలి ప్రధాన మంత్రి నెహ్రూ పేరుతో 4398 రోజుల సుదీర్ఘ వరుస పాలన రికార్డు ఉంది. కానీ.. తాజాగా మోడీ దీనిని అధిగమించారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే పక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానిని పలువురు నాయకులు.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనియాడారు.
అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాము ప్రజలకు లెక్కలు చెప్పడం లేదని.. అన్నీ ఆచరణలో చేసి చూపిస్తున్నామని తెలిపారు. గత పుష్కర కాలంలో 25 కోట్ల మంది పేద కుటుంబాలను పైకి తీసుకువచ్చామన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలను నగరాలతో అనుసంధానించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన చురకలు అంటించారు. ``ఎవరైనా ప్రజల ఆశీర్వాదం ఉంటేనే అధికారంలోకి వస్తారు. ఆ ఆశీర్వాదం మాకు లభించడం అధృష్టం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు. సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారు.`` అని చెప్పారు.
దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని ప్రధానితెలిపారు. ఒకప్పుడు 25 కోట్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉండేదని.. ఇప్పుడు దానిని 100 కోట్ల మంది ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. నిరుద్యోగంపై పోరులో భాగంగా.. మేకిన్ ఇండియా ద్వారా.. అనేక అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విదేశీ వస్తువులను తగ్గించి.. మారకద్రవ్యాన్ని పొదుపు చేయాలని ఇచ్చిన పిలుపు బాగా పనిచేసిందన్నారు. భారత ఖ్యాతి నేడు ప్రపంచదేశాల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోం దని చెప్పారు. అన్ని రంగాలు.. అన్ని వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమని చెప్పారు.
కాంగ్రెస్ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని ప్రధానిమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. బుజ్జగింపు రాజకీయాలతో దేశాన్ని అధోగతి పాల్జేశారని దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. పైగా.. రాజ్యాంగ బద్ధ సంస్థలపై దాడులు చేయడం ఆ పార్టీకి నిత్యకృత్యంగా మారిందంటూ.. ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ చేసిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలకు మేలు చేస్తున్నాం కాబట్టే.. తమను ఎన్నుకుంటున్నారని.. బుజ్జగింపు రాజకీయాలు దేశానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ ను సాకారంచేసే అవకాశం ప్రజలే తమకు ఇచ్చారని పేర్కొన్నారు.
