Begin typing your search above and press return to search.

ఫేక్‌న్యూస్ వార్నింగ్.. జవాన్లపై దాడి వీడియో నిజం కాదు.. కేంద్రం క్లారిటీ!

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు వేగంగా వ్యాపించి సమాజంలో అనవసరమైన భయాందోళనలు, అశాంతిని సృష్టించే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   28 May 2025 12:17 AM IST
ఫేక్‌న్యూస్ వార్నింగ్.. జవాన్లపై దాడి వీడియో నిజం కాదు.. కేంద్రం క్లారిటీ!
X

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక నకిలీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. మన జవాన్లపై దాడి జరిగినట్లుగా చూపించే ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. జమ్మూకశ్మీర్‌లో సీఐఎస్‌ఎఫ్‌ (CISF), సీఆర్‌పీఎఫ్‌ (CRPF) జవాన్లు విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా, వారి కాన్వాయ్‌పై కొందరు రాళ్ల దాడి చేసినట్లుగా ఈ వీడియో సర్క్యులేట్ అవుతోంది. అయితే, ఈ వీడియోను నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ (PIB Fact Check) విభాగం తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.

పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం తన పోస్టులో ఇలా పేర్కొంది: "ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. షేర్ అవుతున్న వీడియో పాతది. అది కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (PoK) ముజఫరాబాద్‌కు సంబంధించినది. అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వీడియోను షేర్ చేయొద్దు." అని స్పష్టం చేసింది.

నకిలీ వార్తలను ఎదుర్కొనేందుకు జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పీఐబీ పిలుపునిచ్చింది. ఏవైనా అనుమానాస్పద వీడియోలు లేదా సమాచారం కనిపిస్తే, పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ వాట్సప్ నంబర్ 8799711259 లేదా E-mail: factcheck@pib.gov.in కు పంపాలని కోరింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించే ఈ రోజుల్లో, ఇలాంటి ఫ్యాక్ట్‌చెక్‌లు చాలా కీలకమని కేంద్రం ఉద్ఘాటించింది.

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు వేగంగా వ్యాపించి సమాజంలో అనవసరమైన భయాందోళనలు, అశాంతిని సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో తప్పుడు సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టించవచ్చు. కాబట్టి, ఏదైనా వీడియో లేదా వార్తను షేర్ చేసే ముందు అది నిజమా కాదా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. కేంద్రం ఇచ్చిన ఈ స్పష్టతతో ప్రజలు తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉంటారని ఆశిద్దాం.