మోహన్ 'దాదా' లాల్.. విలక్షణ నటుడికి ప్రతిష్ఠాత్మక అవార్డు
మోహన్లాల్ హీరోగానే కాక దర్శకుడు, నిర్మాత కూడా. ఆయన భారత చలనచిత్ర రంగానిక ఆదర్శ సేవలు అందించారని కేంద్ర కొనియాడింది.
By: Tupaki Desk | 20 Sept 2025 7:48 PM ISTఎన్నో విలక్షణ పాత్రలు.. మరెన్నో విలక్షణ సినిమాలు.. 40 ఏళ్లకు పైగా ప్రయాణంలో సూపర్డూపర్ హిట్లు.. నటుడిగా అద్భుతమైన ప్రదర్శనలు... కేరళ నుంచి మొదలైన ప్రస్థానం.. బాలీవుడ్ వరకు ఎదురులేకుండా సాగింది... అందుకే ఆయనను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు వరించింది.. ఇదంతా ప్రఖ్యాత నటుడు మోహల్లాల్ గురించి.. మలయాళ నటుడిని దేశంలోనే టాప్ సినీ అవార్డు అయిన ఫాలె్క పురస్కారం వెదుక్కుంటూ వచ్చింది.
నిరుడు మిథున్.. నేడు మోహన్
భారత సినీ చరిత్రకు మోహన్లాల్ చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కె అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ట్వీట్ చేసింది. 2023 సంవత్సరానికి మోహన్లాల్ను ఈ అవార్డుకు ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈ నెల 23న జరిగే కార్యక్రమంలో మోహన్లాల్ ఈ అవార్డును అందుకుంటారు. నిరుడు ఫాల్కె పురస్కారాన్ని పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నటుడు మిథున్ చక్రవర్తికి అందించిన సంగతి తెలిసిందే.
పలు రంగాల్లో ప్రతిభ...
మోహన్లాల్ హీరోగానే కాక దర్శకుడు, నిర్మాత కూడా. ఆయన భారత చలనచిత్ర రంగానిక ఆదర్శ సేవలు అందించారని కేంద్ర కొనియాడింది. అద్భుతమైన నటనా ప్రతిభకు తోడు కృషి, పట్టుదల ఆయన సొంతం అని ప్రశంసించింది. ఇదంతా భారత సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన అధ్యాయం అని అభివర్ణించింది. కాగా, ఈ నెల 23న జరిగే 71వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్లాల్ దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును స్వీకరించనున్నారు.
తెలుగువారికీ సుపరిచితుడే..
జూ.ఎన్టీఆర్తో జనతా గ్యారేజీ వంటి హిట్ సినిమా సహా పలు తెలుగు చిత్రాల్లో మోహన్లాల్ నటించారు. కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. 30 ఏళ్ల కిందట మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువర్ (తెలుగులో ఇద్దరు) సినిమా ఆయన కెరీర్లో మైలురాయి కాగా.. ఇటీవల వచ్చిన దృశ్యం సిరీస్ సినిమాలు మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.
