విశాఖ కొత్త మేయర్ పీలా శ్రీనివాస్
మహా విశాఖ నగర పాలక సంస్థ కొత్త మేయర్ గా పీలా శ్రీనివాసరావు సోమవారం ఎన్నిక అయ్యారు.
By: Tupaki Desk | 28 April 2025 3:56 PM ISTమహా విశాఖ నగర పాలక సంస్థ కొత్త మేయర్ గా పీలా శ్రీనివాసరావు సోమవారం ఎన్నిక అయ్యారు. ఆయన ఎన్నికకు అవసరమైన 58 మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో ఆయన ఎన్నికను అధికారులు ఆమోదించారు.
మేయర్ ఎన్నిక కోసం ఒకే ఒక నామినేషన్ పీలా నుంచి మాత్రమే వచ్చింది. దాంతో పోటీయే లేకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు. ఇ9క పీలా శ్రీనివాసరావు టీడీపీకి చెందిన కార్పోరేటర్ కాగా ఆయన పేరుని జనసేన ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు కుమార్ రాజు ఆ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు.
విశాఖ నగర టీడీపీలో పీలా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనకు అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పీలా పేరునే పార్టీ ప్రకటించింది. ఇపుడు కూడా ఆయనకే టీడీపీ అధినాయకత్వం అవకాశం ఇవ్వడం ద్వారా ఆయన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది అని అంటున్నారు ఇక పీలా విషయానికి వస్తే ఆయనకు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజా సమస్యల విషయంలో ఆయన ఎపుడూ వెనక్కి తగ్గేది ఉండదని చెబుతారు.
ఆయన ముందు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికే చూస్తారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం ఆయనకు ఉన్న అతి పెద్ద అనుకూలత. విశాఖ నగరం అభివృద్ధి విషయంలో ఆయనకు పూర్తి అవగాహన ఉంది. దాంతోనే ఆయనకు టీడీపీ కూటమి విశాఖ ప్రధమ పౌరుడిగా అవకాశం కల్పించింది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే నాలుగేళ్ళ క్రితమే పీలా మేయర్ కావాల్సి ఉంది. కానీ 58 మంది మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు దక్కలేదు. అప్పటికీ 30 మంది దాకా కార్పోరేటర్లను గెలుచుకుని టీడీపీ తన సత్తా చాటింది. ఇక వైసీపీ మేయర్ పదవీ కాలం నాలుగేళ్ళు పూర్తి కావడంతో అవిశ్వాసం ప్రవేశపెట్టారు. దానికి బీజేపీ జనసేనల నుంచి మద్దతు లభించడం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్పోరేటర్లు ఈ వైపుగా రావడంతో మేయర్ ని దించేందుకు అవసరం అయిన మెజారిటీ టీడీపీ కూటమికి దక్కింది.
అలా ఈ నెల 19న వైసీపీ మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా, టీడీపీ కూటమి వైసీపీ నుంచి జీవీఎంసీ పీఠాన్ని కైవశం చేసుకుంది. మొత్తం మీద చూస్తే విశాఖ కార్పోరేషన్ మీద టీడీపీ జెండా ఇపుడు మరోసారి ఎగురుతోంది. విశాఖ నగరంలో బలం ఉండి కూడా మేయర్ పీఠం టీడీపీకి దక్కకపోవడం ఇప్పటిదాకా ఉన్న లోటు. ఆ లోటుని పీలా రూపంలో ఆ పార్టీ భర్తీ చేసుకున్నట్లు అయింది.
ఏపీలో కూటమి అధికారంలో ఉన్నందువల్ల రానున్న రోజులలో విశాఖ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నంబర్ వన్ సిటీగా నిలబెడతామని కూటమి నాయకులు అంటున్నారు. పీలా కూడా తనకు దక్కిన ఈ పదవిని ప్రజా సేవ కోసం మరింతగా ఉపయోగిస్తామని చెబుతున్నారు.