వైసీపీలో రచ్చ: పెద్దిరెడ్డి రాజకీయ సన్యాసం?
అసలు రాజకీయాలే తనకు అవసరం లేదనే పెద్దిరెడ్డి వాపోయినట్టు వైసిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది.
By: Garuda Media | 1 Sept 2025 9:00 PM ISTపుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నారా.. ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారా.. అంటే వైసిపి వర్గాల్లో అవునని సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ అనేక కేసులు చుట్టుముట్టాయి. ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తాజాగా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన డీకేటీ భూముల విషయంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ భూముల రిజిస్ట్రేషన్ ను రద్దుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రభావం కూడా పెద్దిరెడ్డి పై ఎక్కువగా పడుతోంది. మరోవైపు వైసీపీ వైపు నుంచి తాను అనుకున్న స్థాయిలో మద్దతు లభించడం లేదన్నది పెద్దిరెడ్డి అనుచరుల వద్ద చెబుతున్న మాట. రాజంపేట ఎంపీ అరెస్టు అయిన తర్వాత ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీని పరామర్శించింది లేదు. మరి దీని వెనక ఏం జరుగుతోందన్నది లేకపోయినా.. అంతర్గతంగా మాత్రం జగన్ తమ కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని ఇలా అయితే ఇక పార్టీలో ఉండి ప్రయోజనం వెంటనే పెద్దిరెడ్డి భావిస్తున్నారు.
అసలు రాజకీయాలే తనకు అవసరం లేదనే పెద్దిరెడ్డి వాపోయినట్టు వైసిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో గత ఎడాది కూటమి ప్రభావాన్ని సైతం తట్టుకొని అనేక ఇబ్బందులను ఓర్చుకొని మరీ విజయం దక్కించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. గతంలో కూడా ఆయన మంత్రి పదవులు అలంకరించారు. కానీ, ఇప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుటుంబాన్ని కాపాడుకోవడం, మరోవైపు కేసుల నుంచి రక్షించుకోవడం అనేది పెద్దిరెడ్డికి ఈ వయసులో పెద్ద సవాలుగా మారింది.
ప్రస్తుతం రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తే ఈ కేసులు భారం కొంతవరకు తగ్గుతుంది అన్నది ఆయన ఆలోచనగా ఉందని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మదనపల్లిలో జరిగిన ఫైళ్ల అగ్నిప్రమాదం కేసు నుంచి అంగళ్లు సెంటర్లో జరిగిన చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన వరకు అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని తిరిగి తోడాలి అనేది ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
మరోవైపు లిక్కర్ కుంపకోణం కేసు ఎప్పటికీ తేలుతుందో తెలియదు. ఇక ఎంపీ మిధున్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తారు అనేది కూడా సస్పెన్స్ గానే మారింది. మరోవైపు భూముల కుంభకోణం.. తమ పేరుతో ఉన్న భూములను రద్దు చేయడం వంటివి కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని తీవ్రస్థాయిలో కుదిపివేస్తున్నా యి. ఈ క్రమంలో తాను రాజకీయాల నుంచి తప్పుపోవడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్టు పెద్దిరెడ్డి అనుచరులు మధ్య చర్చ సాగుతున్నట్టు సమాచారం.
మరి ఇది ఎంతవరకు నిజం అనేది చూడాలి. రాజకీయాల నుంచి తప్పుకుంటే జగన్ ఏం చేస్తారు? ఆయన ఏమన్నా ఊరడిస్తారా? లేకపోతే మౌనంగా ఉంటారా? అనేది చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం వైసీపీలో ఈ విషయం అంతర్గతంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
