Begin typing your search above and press return to search.

అన్నా డీఎంకే తెగదెంపులు... పవన్ లో కొత్త ఆలోచనలు...?

దాంతో పాటు బీజేపీ తమ దారిలోకి రాకపోతే పవన్ కూడా ఆ పార్టీతో బంధం తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Sept 2023 3:00 AM
అన్నా డీఎంకే తెగదెంపులు... పవన్ లో కొత్త ఆలోచనలు...?
X

పొరుగున ఉన్న తమిళనాడులో అన్నా డీఎంకే దాదాపుగా ఏడేళ్ల బంధాన్ని బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకుంది. 2016 డిసెంబర్ లో జయలలిత మరణం తరువాత అవసరార్ధం బీజేపీతో అన్నా డీఎంకే బంధం కుదిరింది. అలా బీజేపీ సహకారంతో 2021 దాకా ప్రభుత్వాన్ని లాక్కొచ్చారు అన్నా డీఎంకే నేతలు. ఆ మధ్యలో జరిగిన 2019 ఎన్నికల్లో కలసి పోటీ చేశారు, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తరువాత జరిగిన లోకల్ బాడీస్ లోనూ పొత్తులు కొనసాగాయి.

కానీ చిత్రంగా ఇపుడు అన్నాడీఎంకే బీజేపీకి రాం రాం అని చెప్పేసింది. నిజానికి బీజేపీ మిత్రుల మధ్య బంధం ఎపుడూ శాశ్వతం కాదు, శివసేన దానికి అసలైన ఉదాహరణ. శివసేనతో మూడు దశాబ్దాల బంధం బీజేపీది. అయినా వద్దు అని ఒకసారి అనుకుంటే ఇక అంతే. శివసేన బీజేపీ లది భావసారూప్యం కలిగిన పార్టీలు కానీ మధ్యలో అధికారం వచ్చి చిచ్చు పెట్టేసింది.

ఎక్కడ అయినా బీజేపీ అధికారం దిశగానే అడుగులు ఉంటాయి. బీజేపీ దాని కోసం దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యూహాలను అమలు చేస్తూ ఉంటుంది. తాను ఎలాగైనా అధికారంలోకి రావడమే బీజేపీ అంతిమ లక్ష్యంగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీలో చూసుకుంటే బీజేపీకి టీడీపీ బలపడడం ఇష్టం లేదు. అది అందరికీ తెలుసు అని ప్రచారంలో ఉన్న మాట.

బీజేపీకి జగన్ సీఎం గా 2024 లో రావాలి. 2029 నాటికి తాను బలపడి అధికారం చేపట్టాలి. అందుకోసం మరో అయిదారేళ్ళు వేచి ఉండడానికి బీజేపీ ఓకే. కానీ జనసేన మాత్రం టీడీపీతో పొత్తు కలిపింది. తమ వెంట బీజేపీ రావాలని అంటోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్లాన్స్ అన్నీ బీజేపీకి అంతగా నచ్చుతాయా అన్నది చర్చకు వస్తోంది.

ఇక ఏపీలో టీడీపీ సానుభూతిపరులు ఎల్లో మీడియా కూడా బీజేపీ లేని జనసేన టీడీపీ కూటమినే కోరుకుంటోంది అని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే చాలు ఇక అధికారం వచ్చేసినట్లే అని భావిస్తున్నారు. దాంతో పాటు బీజేపీ తమ దారిలోకి రాకపోతే పవన్ కూడా ఆ పార్టీతో బంధం తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తాను బీజేపీ పెద్దలను కలుస్తాను అని పవన్ చెప్పి చాలా రోజులు అయింది. మరి పవన్ అయితే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలేదు. ఆయనకు అపాయిట్మెంట్ ఇచ్చే చాన్స్ ఎంతవరకు ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది. బీజేపీ అయితే ఏపీ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టడంలేదు అంటున్నారు. పైగా బీజేపీ జాతీయ పార్టీగా తన మాటే చెల్లాలని చూస్తుంది అంటారు.

ఏపీలో బీజేపీ జూనియర్ పార్టనర్ అయినా కూడా తమ మాటకు విలువ కోరుకుంటుంది. పైగా తనకు నచ్చినట్లుగా పొత్తులు సెట్ కావాలని చూస్తుంది. అలా అనుకునే జనసేనను చేరదీసి మూడవ కూటమి కట్టాలని చూసింది. కానీ జనసేన మాత్రం టీడీపీతో వెళ్ళింది. ఇలాంటి పరిస్థితులలో బీజేపీ పెద్దలతో పవన్ ఎపుడు భేటీ అవుతారు, ఆ భేటీ సమీప భవిష్యత్తులో ఉంటుందా ఉండదా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.