పవన్ నయా స్కెచ్.. విజయ్ దారిలోనే జనసేనాని..!
ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ సృష్టించిన పొలిటికల్ సెన్సేషన్ను పవన్ కల్యాణ్ నిశితంగా గమనిస్తున్నారనే చర్చ సర్క్యులేట్ అవుతోంది.
By: Garuda Media | 13 Jun 2026 1:00 AM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. నిన్నటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అనే రేంజ్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, సరికొత్త ఓట్ బ్యాంక్ను సొంతం చేసుకునేందుకు ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ సృష్టించిన పొలిటికల్ సెన్సేషన్ను పవన్ కల్యాణ్ నిశితంగా గమనిస్తున్నారనే చర్చ సర్క్యులేట్ అవుతోంది.
తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రధాన కారణం.. యువత, మహిళా ఓటర్లు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సైతం సరిగ్గా ఇదే ఫార్ములాను ఏపీలో అప్లై చేయాలని చూస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో కొత్త ఓటర్లు (ఫస్ట్ టైమ్ ఓటర్లు) యాడ్ కాబోతున్నారు. పాత రాజకీయాలు, కులాల సమీకరణలతో సంబంధం లేని ఈ కొత్త తరం ఓటర్లే రేపటి విజేతను డిసైడ్ చేయబోతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ కన్ను పూర్తిగా ఈ యూత్ ఫోర్స్ పైనే పడింది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనగానే కులాల ప్రస్తావన వస్తుంది. కానీ పవన్ కల్యాణ్ ఈ పాత పంథాను బ్రేక్ చేయాలనుకుంటున్నారు. "నన్ను ఒక కులానికే పరిమితం చేయకండి.. అందరూ ఓట్లేస్తేనే నేను గెలిచాను" అని ఆయన పదే పదే చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. తనపై ఉన్న సొంత సామాజికవర్గ ముద్రను చెరిపేసి, అందరి నాయకుడిగా ఎదగాలన్నది పవన్ ప్లాన్. అందుకోసం అవసరమైతే సొంత వర్గాన్ని కాస్త దూరం పెట్టడానికైనా ఆయన వెనకాడటం లేదని జనసేన వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో చంద్రబాబు మినహా మిగిలిన ప్రధాన నేతలంతా దాదాపు యువకులే. వైసీపీలో జగన్, టీడీపీలో లోకేశ్, జనసేనలో పవన్.. ఈ ముగ్గురిలో యువత ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేదే ఇక్కడ పాయింట్. పవన్ కల్యాణ్పై ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం ఆయనకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపైనే తన ఫోకస్ అని నిరూపించుకునే తాపత్రయంలో ఆయన ఉన్నారు. ఈ క్లీన్ ఇమేజ్తోనే లోకేశ్, జగన్ల కంటే వేగంగా యువతకు కనెక్ట్ అవ్వాలని జనసేనాని భావిస్తున్నారు. మొత్తానికి తమిళనాడులో విజయ్ మ్యాజిక్ రిపీట్ చేసినట్లే.. ఏపీలో సరికొత్త యూత్ వేవ్ను సృష్టించి పవర్ పాలిటిక్స్లో కింగ్ కావాలన్నదే పవన్ కల్యాణ్ నయా స్కెచ్. మరి 2029 నాటికి ఈ కొత్త ఓటర్ల అస్త్రం జనసేనానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
