Begin typing your search above and press return to search.

జనం కోసం పవన్ కొత్త కార్యక్రమం.. అచ్చెన్న నియోజకవర్గం నుంచే మొదలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 May 2025 7:08 AM
జనం కోసం పవన్ కొత్త కార్యక్రమం.. అచ్చెన్న నియోజకవర్గం నుంచే మొదలు
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చిన ఈ ఏడాదిలో ప్రభుత్వంలో పవన్ పరపతి కూడా చాలా పెరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఇక మంత్రిగా తన శాఖను సమర్థంగా నడపడమే కాకుండా, వినూత్న కార్యక్రమాలతో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు పవన్. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లి బాట అనే పేర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన పవన్ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం ఓ ప్రధానమైన నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న డిప్యూటీ సీఎం పవన్.. రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేయడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు అధికార విధులలో బిజీగా ఉంటూ ప్రజల్లో తన పార్టీపై సానుకూల దృక్పథం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమాంతరంగా అధికారాలు లేకపోయినా, తన శాఖ పరిధిలోని అధికారులతో పవన్ సమర్థవంతంగా పనితీరు కనబరుస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆయనతో పోటీపడినట్లు పనిచేస్తానని చెప్పుకోవడమే కాకుండా, అందుకు తగ్గట్లు పనితీరు కనబరుస్తున్నారు.

ప్రజల నుంచి మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని జిల్లాల పర్యటనకు వెళతానని, ప్రతి వారం ఏదో ఒక జిల్లా కేంద్రంలో ఉంటానని గతంలో పవన్ ప్రకటించారు. ఆ విధంగా పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఆయన పర్యటనలకు వెళ్లారు. అయితే ఆయనకు స్టార్ ఇమేజ్ ఉండటం వల్ల ప్రజలతో నేరుగా మమేకం అవ్వడం కుదరడం లేదు. అభిమానులు, కార్యకర్తల హంగామా ఎక్కువైపోతుండటం, వారిని వారించి బాధపెట్టడం ఇష్టం లేక పవన్ తన కార్యక్రమాలను తగ్గించుకుంటున్నట్లు చెబుతున్నారు. క్షేత్ర పర్యటనలతో తాను ఏదో చేద్దామంటే మరో రకమైన ఫలితం వస్తుండటం వల్ల తాజాగా డిప్యూటీ సీఎం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్ర పర్యటనకు వెళ్లకపోయినా, నేరుగా ప్రజలతో ప్రతి రోజూ మాట్లాడేలా వర్చువల్ సమావేశాలకు కొత్త కార్యక్రమం రూపొందించారు. దీనికి ‘‘మన ఊరి కోసం మాటామంతీ’’ అని పెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కో రోజు ఒక్కో గ్రామస్థులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మంగళగిరిలో తన పార్టీ కార్యాలయం నుంచి ఎంపిక చేసిన గ్రామస్థులు అందరినీ తెర ముందు కూర్చొబెట్టి వారి సమస్యలు తెలుసుకుంటారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తారని డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వినూత్న కార్యక్రమానికి ముందుగా టెక్కలి నియోజకవర్గాన్ని డిప్యూటీ సీఎం ఎంపిక చేసుకోవడం విశేషం. టెక్కలి నియోజకవర్గం నుంచి సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కింజరాపు కంచుకోటగా టెక్కలికి గుర్తింపు ఉంది. దీంతో టెక్కలిని ఎంచుకోవడం వల్ల రాజకీయంగా తన ప్రాధాన్యం తెలియజేసినట్లు అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టెక్కలి వంటి టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ విస్తరణకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని విశ్లేషిస్తున్నారు.

గురువారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సన్నాహాలు చేస్తోంది. టెక్కలి నియోజకవర్గం రావివలస గ్రామస్థులతో తొలిరోజు సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు. గ్రామంలో స్క్రీన్ ఏర్పాటు చేసి వారితో మాట్లాడాలని ముందుగా అనుకున్నా, ఎండ మరోవైపు వర్షాలతో వాతావరణం గందరగోళంగా ఉండటంతో టెక్కలిలో ఓ సినిమా థియేటర్ లో తొలిరోజు కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళగిరిలో తన కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా గ్రామస్థులతో మాట్లాడతారు. ఇందుకోసం 290 మందిని ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో తాగునీరు, సాగునీరు, మురుగు కాల్వల నిర్వహణ, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువుల సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.