తమిళనాడులో జనసేన.. పవన్ రియాక్షన్ ఇదే!
తిరుమల లడ్డూ వ్యవహారం వివాదం అయినప్పుడు పవన్ కల్యాణ్ సనాతన ధర్మ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 May 2025 4:30 PMతరచుగా తమిళనాడు రాజకీయాలపై మాట్లాడే జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను రెండు రోజుల కిందట.. తమిళనాడుకు చెందిన ప్రముఖులు కొందరు కలిసారు. వీరిలో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ మనవడు సత్యరాజేంద్రన్ తో పాటు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు రాధాకృష్ణన్, తమిళ రచయిత సచ్చిదానందన్ సహా పలు ప్రజాసంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పవన్తో చర్చించినట్టు తెలిసింది.
తిరుమల లడ్డూ వ్యవహారం వివాదం అయినప్పుడు పవన్ కల్యాణ్ సనాతన ధర్మ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ.. తమిళనాడుకు చెందిన వారు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. ఇదేస మయంలో తమిళనాడుకు చెందిన అంశాలపై స్పందన బాగుందని కూడా పేర్కొన్నారు. హిందీ సహా .. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు కౌంటర్ ఇవ్వడాన్ని వారు ప్రస్తావించారు. ఈ క్రమంలో నే తమిళనాడులో కూడా జనసేన పార్టీ పెట్టాలని వారు సూచించారు.
దాదాపు 3 గంటలకుపైగా పవన్తో చర్చించిన ఎంజీఆర్ మనవడు.. రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేసి నట్టు తెలిసింది. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీని అక్కడ కూడా విస్తరిస్తే బాగుంటుందన్న సూచనలు చేశారు. అయితే.. దీనికి పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం తమ రాష్ట్రంపైనే ఎక్కువగా దృష్టి పెట్టామని.. ఇక్కడ గత ఐదేళ్లలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రోడ్లు కూడా వేయకుండా గత ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని.. చెప్పుకొచ్చారు.
అదేసమయంలో పొత్తులపై కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు కూటమి పార్టీలకు పట్టం కడుతున్నారని.. ఆయన మహారాష్ట్ర, ఏపీ సహా పలు రాష్ట్రాలను ఉదహరించారు. కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. జవాబుదారీ తనం పెరుగుతుందని ప్రజలు నమ్ముతున్నార ని చెప్పారు. బలమైన పార్టీలు పొత్తు పెట్టుకుని విజయం దక్కించుకుంటే.. ప్రజలకు బలమైన ప్రభుత్వం అందుబాటులోకి వస్తుందని.. తద్వారా అభివృద్ధి జరుగుతుందని.. దీనికి ఏపీనే ఉదాహరణగా పేర్కొన్నారు.