పవన్ కు జరిగిన ఆపరేషన్ ఏంటి? ఫ్యాన్స్ లో కంగారు? అన్నా లెజినావా పోస్ట్ వైరల్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
By: A.N.Kumar | 19 April 2026 10:58 AM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయనకు శస్త్రచికిత్స జరిగినట్లు అధికారికంగా ధృవీకరణ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అసలు ఆయనకు ఏమైంది? శస్త్రచికిత్స ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే వివరాలు జనసేన నుంచి కానీ పవన్ ఫ్యామిలీ నుంచి కానీ అధికారికంగా బయటకు రాలేదు. కేవలం అస్వస్థతతో శస్త్రచికిత్స జరిగిందనే సమాచారం మాత్రమే ఇచ్చారు.
అకస్మాత్తుగా అస్వస్థత.. ఏం జరిగింది?
శుక్రవారం ఉదయం విజయవాడలో ప్రభుత్వ అధికారులతో కీలకమైన సమీక్షా సమావేశంలో పాల్గొంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముఖంలో నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించడంతో అధికారులు ఆందోళన చెందారు. పరిస్థితిని గమనించిన ఆయన వ్యక్తిగత సిబ్బంది వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వైద్యుల ప్రాథమిక సూచనల మేరకు తదుపరి అధికారిక కార్యక్రమాలన్నింటినీ తక్షణమే రద్దు చేసుకుని, ఆయనను ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే నిపుణులైన వైద్య బృందం ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించింది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాసనాళాలకు సంబంధించిన ఇబ్బంది తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
సైనసైటిస్ సమస్య.. శస్త్రచికిత్స నిర్ణయం
వైద్య వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. నిరంతరం రాజకీయ పర్యటనలు, ప్రజల మధ్య ఉండటం, దుమ్ము, కాలుష్యం కారణంగా ఈ సమస్య కాలక్రమేణా ముదిరినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆయన ముక్కు లోపల శ్వాస మార్గంలో ఆటంకాలు ఏర్పడి, ఆక్సిజన్ అందడం కష్టతరంగా మారింది.
పరిస్థితిని సమీక్షించిన వైద్యులు, మందులతో కంటే శస్త్రచికిత్స ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయనకు ముక్కుకు సంబంధించిన చిన్నపాటి శస్త్రచికిత్సను అత్యవసరంగా నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు ప్రకటించారు.
విశ్రాంతి తప్పనిసరి.. రాజకీయాలకు తాత్కాలిక విరామం
శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ను ప్రత్యేక వార్డుకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు భరోసా ఇచ్చారు. అయితే కోలుకోవడానికి.. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండటానికి ఆయనకు కనీసం ఒక వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రిస్క్రిప్షన్లో పేర్కొన్నారు.
దీనివల్ల ఆయన ముందుగా నిర్ణయించుకున్న శాఖాపరమైన సమీక్షలు, పార్టీ కార్యక్రమాలు.. సినిమా షూటింగ్లకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. వారం రోజుల తర్వాత తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయన ఎప్పుడు విధుల్లోకి చేరాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.
స్పందించిన కుటుంబ సభ్యులు.. సినీ ప్రముఖులు
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అటు కుటుంబ సభ్యులు, ఇటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన భార్య అన్నా లెజినోవా స్పందిస్తూ.. "ఆల్ ఈజ్ వెల్.. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. ఆయన త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు" అని ధైర్యం చెప్పారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ "Get well soon మామయ్య" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ కూడా అధికారికంగా ఆయన కోలుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
అభిమానుల ప్రార్థనలు
ఒకవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పాలనాపరమైన బాధ్యతలు, మరోవైపు భారీ చిత్రాల షూటింగ్లను పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా పూర్తి చేశారు. ఇలాంటి బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీవ్యాప్తంగా అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
వైద్యులు ఇచ్చిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని, ఆయన కోలుకునే వేగం ఆశాజనకంగా ఉందని తెలుస్తోంది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని, కేవలం విశ్రాంతి కోసమే ఆయన బయటకు రావడం లేదని స్పష్టమవుతోంది.
