పల్లె పండుగ 2.0 స్టార్ట్ చేసిన పవన్.. 15 ఏళ్ల పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు
గత ఐదేళ్ల వైసీపీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే గుంతలుపడ్డ రోడ్లు, మరమ్మతులు నోచుకోని కాలువలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులు గుర్తుకొస్తాయని పవన్ విమర్శలు గుప్పించారు.
By: Tupaki Political Desk | 26 Nov 2025 6:35 PM ISTరాష్ట్రంలో గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం... ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు పవన్ ప్రకటించారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండగ తొలి దశకు సంబంధించి చేపట్టిన పనులు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా తిలకించారు.
పల్లె పండగ 2.0 ద్వారా రెండింతల అభివృద్ధి
పల్లె పండగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పవన్ తెలిపారు. ఇప్పుడు పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా రూ. 5,838 కోట్ల అంచనా వ్యయంతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మిస్తున్నట్లు పవన్ వివరించారు. ‘‘పాత రహదారుల పునర్నిర్మాణం, రూ. 375 కోట్ల వ్యయంతో 25 వేల మినీ గోకులాలు, రూ. 16 కోట్లతో 157 కమ్యూనిటీ గోకులాలు, రూ. 4 కోట్లతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు పవన్ వివరించారు. పంచాయతీల పరిధిలో రూ. 406 కోట్లతో 15 వేల కొత్త అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
వారసత్వంగా అప్పులు, సమస్యలు
గత ఐదేళ్ల వైసీపీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే గుంతలుపడ్డ రోడ్లు, మరమ్మతులు నోచుకోని కాలువలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులు గుర్తుకొస్తాయని పవన్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వానికి వారసత్వంగా ఏదైనా వచ్చిందంటే అవి అప్పులు, సమస్యలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో నాయకుల దగ్గరకు వెళ్లి ఇది చేయండి అని అడిగే పరిస్థితి ఉండేది కాదని, మార్పు కావాలని యువత బలంగా తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు ప్రభుత్వం మారిపోయిందని పవన్ తెలిపారు.
గత ప్రభుత్వంలా దోచుకోవడం లేదు
గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలు కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో ఏం చేసిందని మాట్లాడుతున్నాయని పవన్ ఆక్షేపించారు. గత ప్రభుత్వంలా మేము దోచుకోవడం లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం లేదు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నాం. అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పెన్షన్లు మీకంటే బలంగా ఇస్తున్నాం. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో ఇక్కడ విప్లవాలు వస్తాయని కొంతమంది నాయకులు కలలు కంటున్నారు. గత ప్రభుత్వం ఇంకో ఏడాది అధికారంలో ఉంటే అలాగే జరిగేది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి గొడవలు లేకుండానే ఓటు అనే ఆయుధంతో యువత ప్రభుత్వాన్నే మార్చేశారంటూ పవన్ వివరించారు.
వాళ్లు రావడం అసాధ్యం
ప్రజా క్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వాళ్ల బూతులు మారడం లేదు. వాళ్ల బుద్ధి మారడం లేదు. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తాం. అని సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. వైసీపీ నాయకుల తీరుపై పిఠాపురంలో ఒకసారి మాట్లాడాను. మరోసారి చెబుతున్నాను.. నోరుంది కదా అని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 2029లో మళ్లీ మేము వస్తామని కలలుకంటున్న వైసీపీ బ్యాచ్ కు రాజోలు గడ్డ నుంచి ఒకటే చెబుతున్నాం... మీరు రారు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. అవి జరగవు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.’’ అంటూ పవన్ విస్పష్టంగా ప్రకటించారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకులా చూసుకుంటారని, కూటమి ప్రభుత్వాన్ని మీరు పెద్ద కొడుకులా కాపాడితే ... ఆ పెద్ద కొడుకే మీకు భవిష్యత్తు ఇస్తాడని రైతులతో వ్యాఖ్యానించారు పవన్.
