కులం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు
తన పార్టీలో కూడా నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించినపుడు కూడా కులాల గురించి చూసి ఆలోచిస్తున్నారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
By: Satya P | 27 May 2026 9:29 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కులం గురించి రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాల మీద మతాల మీద ఆయన తనదైన విశాలమైన భావాలతో నిర్వచనం చెప్పారు. మనం యాక్సిడెంటల్ గా ఒక కులంలోనో మతంలోనో పుడితే అక్కడే ఉండిపోతామా అక్కడే కూరుకుని పోతామా అని ప్రశ్నించారు. అయితే పుట్టిన కులాన్ని గౌరవించాల్సిందే అని అంటూ సమాజం పట్ల నేల పట్ల జన్మ భూమి పట్ల బాధ్యత వహించాలని పవన్ అన్నారు.
తాను కులం ప్రస్తావన
ఇక తాను రాజకీయాల్లోకి వచ్చింది సమాజం కోసం అని పవన్ చెప్పారు. తనకు సమాజం అభివృద్ధి ముఖ్యమని ఆయన చెప్పారు తాను ఒక కులం కోసమో మరో దానికో రాజకీయాల్లోకి రాలేదని పవన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో కాపు నాయకులకు ఇబ్బందిగా ఉండొచ్చు అని పవన్ అంటూ అయినా సరే తాను ఇదే మాట పదే పదే చెబుతాను అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
రంగా ప్రస్తావన :
మాట్లాడితే చాలు వంగవీటి రంగా ప్రస్తావనను తీసుకుని వస్తారు అని ఆయన అన్నారు. అయితే వంగవీటి రంగా సతీమణి ఎవరు అన్న సంగతిని వీరు చాలా కన్వీనియెంట్ గా మరచిపోతున్నారని అన్నారు ఆమె కమ్మ సామాజిక వర్గం అయితే వారికి పుట్టిన బిడ్డలు రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు అవుతారు అని పవన్ అన్నారు. అయినా కులాల గురించి మతాల గురించి మాట్లాడుకోవడం మంచిది కాదని ఆయన హితవు చెప్పరు. ఈ దేశం కోసం ఈ నేల కోసం ఈ రాష్ట్రం కోసం పాటు పడడానికే తాను రాజకీయాల్లోకి వచ్చాను అని ఆయన స్పష్టం చేశారు. మా ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే ఉండేదని అన్నారు. తన చిన్నపుడు మనది ఏ కులం అని అడిగితే తన తల్లి తిట్టింది అని గుర్తు చేశారు. తన తండ్రి సోషలిస్ట్ అని చెబుతూ సోషలిస్ట్ భావాలతో తాము పెరిగామని చెప్పారు. సొసైటీ కోసం మాట్లాడడం దాని కోసం పనిచేయడమే తమకు అలవాటు అని పవన్ ఉన్నది ఉన్నట్లుగా తేల్చి చెప్పారు.
కులాలు చూడవద్దు :
తన పార్టీలో కూడా నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించినపుడు కూడా కులాల గురించి చూసి ఆలోచిస్తున్నారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వారు పార్టీలో మంచి నేత అని అవకాశం ఇచ్చినా కూడా ఈ విధంగా చూడడం తగదని పవన్ హిత బోధ చేశారు. రంగా బతికి ఉన్నాపుడు వైసీపీ నేతలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు ఆయన పోగానే మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారు అని అన్నారు. మానవత్వం చూడాలి కానీ కులం చూడకూడదని ఆయన అన్నారు. కులం గురించి మాట్లాడితే విసుగేస్తోంది అని పవన్ అన్నారు. తనను విమర్శిస్తున్న నాయకుల ఒక్కొక్కరి చిట్టాను విప్పేదా అని అంటూ ఆయన ఫైర్ అయ్యారు. నేను మాట్లాడితే తట్టుకోగలరా అని ప్రశ్నించారు. కులాలు మతాలు దాటి ప్రజా సమస్యల మీద మాట్లాడుతామని తాను అనుకుంటే ఈ ప్రస్తావన విసుగు తెప్పిస్తున్నాయని పవన్ చెప్పారు. మొత్తానికి పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
