Begin typing your search above and press return to search.

పార్లమెంట్ సెక్యూరిటీ లోపం.. గరుడ ద్వారం వరకూ చేరిన యువకుడు

శుక్రవారం ఉదయం సుమారు 5:50 గంటల సమయంలో ఆ వ్యక్తి రైల్ భవన్ వైపు నుంచి ఒక చెట్టు ఆధారంగా పార్లమెంట్ గోడ ఎక్కి లోపలికి దూకాడు.

By:  Tupaki Desk   |   22 Aug 2025 4:04 PM IST
పార్లమెంట్ సెక్యూరిటీ లోపం.. గరుడ ద్వారం వరకూ చేరిన యువకుడు
X

దేశ రాజధానిలోని పార్లమెంట్ భవనం భద్రతలో మరోసారి పెద్ద పొరపాటు బయటపడింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు గోడ ఎక్కి లోపలికి ప్రవేశించాడు. నేరుగా కొత్త పార్లమెంట్ గరుడ ద్వారం వరకూ చేరుకున్న అతడిని అక్కడే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

లోపలికి ఎలా చొరబడ్డాడు?

శుక్రవారం ఉదయం సుమారు 5:50 గంటల సమయంలో ఆ వ్యక్తి రైల్ భవన్ వైపు నుంచి ఒక చెట్టు ఆధారంగా పార్లమెంట్ గోడ ఎక్కి లోపలికి దూకాడు. కొత్త భవనం గరుడ ద్వారం దాకా వచ్చేసరికి సెంట్రీలు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21న ముగియగా, మరుసటి రోజే ఈ భద్రతా లోపం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

యువకుడి గుర్తింపు

దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల రామా. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అతడిని కస్టడీలో ఉంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు..

అయితే ఇది మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఓ యువకుడు పార్లమెంట్ గోడ ఎక్కి అనెక్సీ భవన ప్రాంగణంలోకి చేరాడు. అప్పట్లో సీఐఎస్ఎఫ్(CISF) సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అతని వద్ద అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదు.

2023లో పెద్ద కలకలం

2023లో, 2001 పార్లమెంట్ దాడి వార్షికోత్సవం రోజున మరో పెద్ద భద్రతా లోపం బయటపడింది. లోక్‌సభలో జీరో అవర్ సమయంలో, ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి లోపలికి దూకి పసుపురంగు పొగ వదులుతూ నినాదాలు చేశారు. వారిని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, మరో ఇద్దరు బయట గేట్ల వద్ద రంగు పొగలు వదిలి నినాదాలు చేశారు. మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా, ఆ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన లలిత్ ఝా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు పోలీసులను సమాధానం చెప్పమని ఆదేశించింది.