మోడీ దెబ్బకు మెలోడీ ‘అవుట్ ఆఫ్ స్టాక్’
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే విషయంలో ముందుంటారు.
By: Garuda Media | 22 May 2026 10:09 AM ISTదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే విషయంలో ముందుంటారు. ఆయన టీంలోని వారి నిర్ణయాలు.. కొన్ని సందర్భాల్లో వ్యవహరించే విషయంలో ఆయనలోని క్రియేటివిటికీకి దేశ ప్రజలు మాత్రమే కాదు అంతర్జాతీయంగా అందరూ తనవైపు చూసేలా చేయటంలో ఆయన ముందంటారు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా నరేంద్రమోడీ మరోసారి వ్యవహరించారు తన విదేశీ పర్యటనలోభాగంగా.. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనికి బహుమతి ఇచ్చే సందర్భంగా ఆమె పేరు.. తన పేరు కలిసేలా పార్లే సంస్థకు చెందిన మెలోడీ చాక్లెట్ల పాకెట్ ను ఇవ్వటం.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇదో పెద్ద సంచలనంగా మారింది.
ఇటలీ ప్రధాని సైతం మోడీ ఇచ్చిన బహుమతికి ఫిదా అయ్యారనే చెప్పాలి. ఈ కారణంగా 43 ఏళ్లుగా మార్కెట్ లో ఉన్న మెలోడీ చాక్లెట్లు ఇప్పుడు సమ్ థింగ్ స్పెషల్ గా మారింది. ఇంటా బయటా.. అన్నిచోట్ల ఇప్పుడు మెలోడీ చాక్లెట్ల అంశం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పలు విశేషాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన మెలోడీ.. వ్యాపార వర్గాల్లోనూ సంచనలంగా మారింది.
ఈ కారణంగా ఎప్పుడూ లేని విధంగా క్విక్ కామర్స్ యాప్స్ లో పార్లే మెలోడీ చాక్లెట్లు అవుట్ ఆఫ్ స్టాక్ గా మారింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన బహుమతి వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. ఇది కాస్తా విపరీతమైన వైరల్ కావటమే కాదు.. మెలోడీ చాక్లెట్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. నిజానికి డెబ్భైల్లో పుట్టిన వారికి మెలోడీ చాక్లెట్ సుపరిచితం.
1990 తర్వాత పుట్టిన వారికి పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. ఫలానా బ్రాండ్ గా తెలిసినప్పటికి.. తప్పనిసరిగా దాన్ని రుచి చూడాలన్నది లేదు. తాజా పరిణామాలతో ఒక్కసారి ఈ చాక్లెట్ రుచి చూడాలన్న క్రేజ్ భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లే క్విక్ కామర్స్ యాప్స్ లో మెలోడీ అవుటాఫ్ స్టాక్ అన్న బోర్డులు పెట్టేసిన పరిస్థితి. సూపర్ మార్కెట్లలోనూ మెలోడీ చాక్లెట్ల గురించి ప్రత్యేకంగా అడిగి మరీ కొనుగోలు చేస్తున్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.
మెలోడీ టోఫీకి సంబంధించి గూగుల్ లో పెద్ద ఎత్తున దీని గురించి వెతికిన విషయాన్ని వెల్లడించింది. గూగుల్ లో మెలోడీ టాఫీ అన్న పేరుతో పెద్ద ఎత్తున వెతుకులాట చేసినట్లుగా చెబుతున్నారు. మెలోడీ టోఫీకి సంబంధించిన వెతుకులాటలు ఎంత భారీగా నమోదయ్యాయి అంటే.. 950 శాతం పెరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి పార్లే మెలోడీ చాక్లెట్ ఒక్కొక్కటి రూపాయి మాత్రమే. దీన్ని కొందరు రూపాయి చాక్లెట్ గా పిలుస్తుంటారు. అలాంటి చాక్లెట్ మోడీ కారణంగా అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. రెండు దేశాలకు చెందిన వ్యాపార వర్గాల్లో దీని గురించే చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు.
మోడీ కారణంగా టోఫీ డిప్లమసీగా పార్లే మెలోడీ మారింది. అన్నింటికంటే ఆసక్తికర.. ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏమంటే.. మెలోడీ చాక్లెట్ దశాబ్దాల తరబడి టీవీల్లోనూ ఇతర మాధ్యమాల్లో ఇచ్చిన ప్రకటన కంటే.. ఇటలీ ప్రధానమంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఆరు గంటల వ్యవధిలో అనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తాము కలలో కూడా ఊహించని విధంగా వచ్చిన ఉచిత అంతర్జాతీయ ప్రచారానికి మెలోడీ చాక్లెట్లను తయారు చేసే పార్లే కంపెనీ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
అదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కంపెనీ ద్వారా తమ సిన్సియర్ థ్యాంక్స్ ను పేర్కొంది. తాము ఈ చాక్లెట్ ద్వారా 1983 నుంచి దేశ ప్రజలకు మధురత్వాన్ని పంచుతున్నట్లుగా పేర్కొన్న సంస్థ.. ఇటలీ ప్రధానికి దేశ ప్రధాని మోడీ బహుమతిగా ఇవ్వనున్న అంశం గురించి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండానే ప్రధాని పార్లే మెలోడీ టోఫీని ఇచ్చినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మెలోడీ చాక్లెట్ కు వచ్చిన అనూహ్య ఆదరణ పుణ్యమా అని స్టాక్ మార్కెట్ లో కూడా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ సంస్థకు సంబంధించిన షేర్లు.. స్టాక్ మార్కెట్లో దూసుకెళ్లాయి. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. దేశ ప్రజలకు సుపరిచితమైన పార్లే జీ దెబ్బకు.. ఈ షేర్లు కొనేందసుకు తీవ్రమైన అసక్తి వ్యక్తమైంది. దీంతో.. ఈ కంపెనీకి ఏ మాత్రం సంబంధం లేని మరో సంస్థ షేర్లు (పార్లే పేరు ఉండటంతో) దూసుకెళ్లాయి. అంతేకాదు.. అత్యంత వేగంగా 11 మిలియన్ల లైక్స్ ను దాటిన పొలిటికల్ రీల్ నిలిచింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తన అధికారిక ఇన్ స్టాలో పోస్టు చేసిన రోజులోనే 1.1 కోట్లకు పైగా లైక్స్ తో పాటు వారి ఇమేజ్ భారీగా పెరిగిన పరిస్థితి. మొత్తంగా మోడీ తీసుకున్న ఒక నిర్ణయం దేశ ప్రజలంతా ఈ రూపాయి చాక్లెట్ల గురించి మాట్లాడుకునేలా చేయటమే కాదు.. అంతర్జాతీయంగా కొత్త ఆసక్తిని రేకెత్తించేలా చేసిందని చెప్పక తప్పదు.
