Begin typing your search above and press return to search.

ధర్మవరంలో పరిటాల రాజకీయ గర్జన

ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు 2024లో పొత్తులలో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి వెళ్ళింది.

By:  Tupaki Desk   |   23 May 2025 7:12 PM
Paritala Sriram Bold Statement at Mahanadu
X

అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక భారీ డైలాగ్ చెబుతాడు. బయట సాఫ్ట్ కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది అని. సేం టూ సేం అదే డైలాగ్ కొట్టారు పరిటాల శ్రీరామ్. ఆయన అనంతపురం జిల్లా యువ నేత. పరిటాల రవీంద్రకు అసలైన వారసుడు. ఇలా ఆయన పేరుకు ముందు ఎన్నో విశేషాలు ట్యాగ్స్ ఉన్నా అసెంబ్లీ ముఖం మాత్రం ఈ రోజుకీ చూడలేకపోయారు.

ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు 2024లో పొత్తులలో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి వెళ్ళింది. లక్కీగా సత్యకుమార్ యాదవ్ ఆ సీటు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కూడా అయ్యారు. అలా ధర్మవరం కమలం పరం అయింది. దాంతో పరిటాలకు చోటు లేకుండా పోయింది.

ఇక చూస్తే ఆయన తల్లి పరిటాల సునీత రాప్తాడు నుంచి మళ్ళీ గెలిచారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోతే పరిటాల శ్రీరామ్ అదే సీటు నుంచి పోటీ చేస్తారు అన్న టాక్ ఉంది. కానీ తాజాగా ధర్మవరంలో జరిగిన మినీ మహానాడులో శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరాన్ని తాను మరచిపోను అన్నారు.

ధర్మవరం తనకు ఎంతో నేర్పింది అని అన్నారు. యుద్ధం చేస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది అది చాలు అని అంటూ తనకు అయితే ఈ రోజుకీ ఓపిక కూడా ఎక్కువే అన్నారు అయినా తనలో ఒరిజినాలిటీ మాత్రం అలాగే పదిలంగా ఉందని హాట్ కామెంట్స్ చేశారు.

ధర్మవరం టీడీపీ క్యాడర్ డీలా పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను వారి వెంట ఉంటాను అని హామీ ఇచ్చారు. తప్పు చేసినా ఒప్పు చేసినా మీకు నేను ఉన్నానని పరిటాల శ్రీరామ్ గట్టి భరోసా ఇచ్చేశారు. మీరు ఎవరికీ భయపడాల్సింది లేదు, ధైర్యంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

అయితే పరిటాల మనసు ధర్మవరం మీద ఉందా అందుకేనా ఈ కామెంట్స్ చేశారు అని అంతా చర్చించుకుంటున్నారు. ధర్మవరంలో చూస్తే అనేక సార్లు గెలిచిన వరదాపురం సూరి బీజేపీలో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరి టికెట్ తీసుకుంటారు అని అంటున్నారు. ఇక పరిటాల ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వకుండా వారి సొంత సీటు రాప్తాడునే శ్రీరామ్ కి ఇచ్చి సునీతకు రెస్ట్ ఇస్తారని అంటున్నారు.

అయితే పరిటాల ఫ్యామిలీ ఆలోచనలు మాత్రం రాప్తాడు ధర్మవరం రెండింటిలోనూ తమ హవా చాటాలని ఉన్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు ఈ లెక్కన చూస్తే రాప్తాడు నుంచి మరోసారి సునీత పోటీ చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక బీజేపీ ధర్మవరం సీట్లో గెలిచింది మంత్రి కూడా అయిన సత్యకుమార్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేస్తారని అంటున్నారు.

దాంతో పాటు బీజేపీ ఈ సీటు వదులుకునే ప్రశ్న లేదని చెబుతున్నారు. ఇక పరిటాల శ్రీరామ్ చేసిన మరో వ్యాఖ్య ఎవరికీ భయపడవద్దు అని. టీడీపీ అధికారంలో ఉన్న వేళ ఎవరికి టీడీపీ క్యాడర్ భయపడాలి ఎందుకు భయపడాలి అన్న ప్రశ్న వస్తోంది. యుద్ధం చేయడానికి అవసరం అయితే అరచేయి ఆయుధం అవుతుంది అని అంటూ ఆయన చేసిన మరో వ్యాఖ్య ఎవరి మీద అని కూడా చర్చిస్తున్నారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే ఓటమి తరువాత నిరాశలో మునిగి స్థానికంగా ఉండటం లేదు అని అంటున్నారు. దాంతో పాటు వైసీపీ సందడి అయితే పెద్దగా లేదు అని చెబుతున్నారు. ఇక నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీకి చెందిన వారు. సత్య కుమార్ యాదవ్ ఎవరినీ భయపెట్టి రాజకీయాలు చేసే రకం కాదు అని అంటారు.

ఇలాంటి నేపధ్యంలో పరిటాల శ్రీరామ్ చేసిన హాట్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నదే అర్థం కావడం లేదు. ఒరిజినల్ అలాగే ఉంది అంటే తండ్రి రవీంద్ర తరహాలో దూకుడు రాజకీయం చేయగలను అని శ్రీరామ్ చెప్పారా అన్నది కూడా చర్చగా ఉంది ఏది ఏమైనా మహానాడు వేదికగా శ్రీరామ్ చేసిన రాజకీయ గర్జనతో అనేక అర్థాలు పరమార్ధాలను స్వపక్షంలోనూ మిత్ర పక్షంలోనూ వైసీపీలోనూ వెతుక్కుంటున్నారు.