భారత్-పాక్ టెన్షన్ వేళ..ఒడిశా పోర్టులో అనుమానాస్పద నౌక
భారత్, పాకిస్తాన్ మధ్యలో ప్రస్తుతం సంబంధాలు సరిగా లేవు. దీంతో దేశంలోని పోర్టులపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
By: Tupaki Desk | 14 May 2025 10:18 AMభారత్, పాకిస్తాన్ మధ్యలో ప్రస్తుతం సంబంధాలు సరిగా లేవు. దీంతో దేశంలోని పోర్టులపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఈ టైమ్లో ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు ఒక ఓడ రావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆ ఓడలో ఏకంగా 21 మంది పాకిస్తాన్ సిబ్బంది ఉన్నారు. దీంతో పోర్టులో వెంటనే సెక్యూరిటీని పెంచేశారు. ఆ ఏరియా మొత్తాన్ని హై అలర్ట్లో పెట్టారు.
బుధవారం పొద్దున్నే సౌత్ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఒక ఓడ పారాదీప్ పోర్టుకు వచ్చింది. ‘ఎంటీ సైరన్ II’ అనే ఆ ఓడ పేరు. దానిలో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం ముడి చమురు తీసుకొచ్చింది ఆ ఓడ. అయితే అధికారులు చెక్ చేస్తుంటే అందులో 21 మంది పాకిస్తాన్ వాళ్లని గుర్తించారు.
ఇమ్మిగ్రేషన్ వాళ్లు ఈ విషయం చెప్పగానే, ఒడిశా మెరైన్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వాళ్లు వెంటనే రెడీ అయిపోయారు. పోర్టులో సెక్యూరిటీని బాగా పెంచేశామని మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా దుహెరి చెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్యలో ఉన్న టెన్షన్ చూస్తుంటే పోర్టు ఏరియాలో హై అలర్ట్ ప్రకటించామని, పరిస్థితిని చూస్తున్నామని ఆమె అన్నారు.
ప్రస్తుతానికి ఆ ఓడ పోర్టుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పీఎం బెర్త్’ దగ్గర ఆగి ఉంది. దానిలో 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉందని అధికారులు చెప్పారు. ముడి చమురు దింపేసే వరకు ఆ 25 మంది సిబ్బంది ఓడ దిగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.