'స్మృతి మంధాన వివాహం'పై తాజా అధికారిక అప్ డేట్ ఇదే!
అవును... భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం మళ్లీ వాయిదా పడింది.
By: Raja Ch | 25 Nov 2025 4:11 PM ISTభారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ మచ్చల్ వివాహం వాస్తవానికి ఈ నెల 23న జరగాల్సిన సంగతి తెలిసిందే. అయితే.. మంధాన తండ్రి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరడంతో ఆమె వివాహం వాయిదా పడిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో మంధాన మేనేజర్, వరుడు పలాశ్ సోదరి నుంచి కీలక అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది.
అవును... భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి ఆదివారం వివాహం జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పలాశ్ సోదరి, సింగర్ పలాక్ ముచ్చల్ ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీ షేర్ చేశారు. ఇందులో భాగంగా... ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబాల గోప్యతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
స్మృతి మంధాన నాన్నగారికి అనారోగ్యం కారణంగా.. మంధాన, పలాశ్ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయిందని.. ఈ సున్నిత సమయంలో అందరూ ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మరోవైపు.. మంధాన తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నారని.. ఆయనను ఆస్పత్రికి తరలించారని.. ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంధాన స్పష్టంగా చెప్పిందని.. అందువల్ల వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుందని స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా పేర్కొన్నారు.
మరోసారి ఆస్పత్రికి పలాశ్!:
స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆమె వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్లాంగీలోని ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు వరుడు పలాశ్ ముచ్చల్ సైతం వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ వల్ల ఇబ్బందిపడడంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే.
అయితే మంగళవారం మరోసారి పలాశ్ ముచ్చల్ అస్వస్థతకు గురవడంతో ముంబయిలోని ఎస్.వీ.ఆర్. ఆస్పత్రికి తరలించారు! ఫొటో షూట్ ల కోసం వరుస ప్రయాణాలు, కొన్ని రోజులుగా సంగీత్ తో పాటు వివిధ కార్యక్రమాల్లో డ్యాన్సులు చేస్తుండానికి తోడు సరైన నిద్ర లేకపోవడం, ఇతర కారణాల వల్ల అతడు ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురైనట్లు అతడి టీమ్ పేర్కొంది.
ఇదే సమయంలో.. స్మృతి తండ్రికి, పలాశ్ కు మంచి అనుబంధం ఉందని.. ఆదివారం ఆయన అనారోగ్యానికి గురవడాన్ని తట్టుకోలేకపోయిన పలాశ్ దాదాపు నాలుగు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నారని అతడి తల్లి పేర్కొన్నారు. దాంతోనే పలాశ్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలిపారు.
కాగా... కొన్ని రోజుల కిందటే స్మృతి మంధాన వివాహ వేడుకలు మొదలయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ పాల్గొని సందడి చేశారు.
