అమెరికాలో తొడగొడుతూ.. నీటి కోసం భారత్ ను అడుక్కుంటూ..
ఇలాంటి పరిస్థితుల్లో పాక్ విదేశాంగ శాఖ భారత్ను ఆశ్రయించి, సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని వేడుకుంటోంది.
By: A.N.Kumar | 12 Aug 2025 7:44 PM ISTఒకవైపు అణ్వాయుధాలతో బెదిరిస్తూనే, మరోవైపు నీటి కోసం భారత్ను వేడుకుంటున్న పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఆ దేశం అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి నిదర్శనం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్, ఇప్పుడు తన తప్పుల పర్యవసానాలను ఎదుర్కొంటోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు వెళ్లే నీటి సరఫరాను నిలిపివేసినప్పటి నుండి, పాక్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది.
నీటి సంక్షోభం: పాక్ కు కష్టాలు
భారత్ నీటి సరఫరాను నిలిపివేయడంతో పాకిస్తాన్ సింధు బేసిన్లో ప్రవాహం 15% తగ్గింది. జలాశయాలలో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. దీని వల్ల రాబోయే ఖరీఫ్ సీజన్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, దాదాపు 21% నీటి లోటు ఏర్పడుతుందని పాక్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభం దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-అణు బెదిరింపులు vs నీటి వేడుకలు
ఇలాంటి పరిస్థితుల్లో పాక్ విదేశాంగ శాఖ భారత్ను ఆశ్రయించి, సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని వేడుకుంటోంది. "సింధూ జలాల ఒప్పందం సాధారణ అమలును తక్షణమే పునరుద్ధరించాలని, ఒప్పంద బాధ్యతలను పూర్తి స్థాయిలో నమ్మకంగా నెరవేర్చాలని మేము కోరుతున్నాము" అని అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్పై అణు దాడుల బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారత్ను "హైవేపై దూసుకువస్తున్న మెర్సిడెస్ కారు"తో పోల్చి, పాకిస్తాన్ను "కంకరతో నిండిన డంప్ లారీ"గా అభివర్ణిస్తూ, ఢీకొంటే ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందో ఆలోచించమని హెచ్చరించారు. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా సింధూ జలాల సరఫరా నిలిపివేత కొనసాగితే యుద్ధం తప్పదని వ్యాఖ్యానించారు.
-పాక్ ద్వంద్వ వైఖరి: భారత్ స్పష్టమైన వైఖరి
1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ జలాల ఒప్పందం, ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ మధ్య పెద్దగా వివాదాలకు తావివ్వలేదు. కానీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నియంత్రణ రేఖ వెంట దాడులకు మద్దతు ఇవ్వడం వంటి పాక్ చర్యల వల్ల భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. "ఉగ్రవాదంపై పాక్ వైఖరి మారకపోతే, నీటి సరఫరా పునరుద్ధరించబడదు." అని పేర్కొంది. అణుబెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత నీటి సంక్షోభం, వారి స్వంత విధానాల ఫలితమే. ఒకవైపు బెదిరింపులకు పాల్పడుతూ, మరోవైపు సహాయం కోసం చేతులు చాచడం, పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ప్రపంచానికి మరోసారి చాటిచెబుతోంది.
