కేజీ ఉల్లి రూ.300.. చికెన్ రూ.600 పాక్ లో దారుణ పరిస్థితి
ఇదిలా ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. కేవలం మూడురోజుల ఉద్రిక్త వాతావరణానికే పాకిస్తాన్ లో తీవ్రమైన ఇంధన కొరత చోటు చేసుకోవటం గమనార్హం.
By: Tupaki Desk | 11 May 2025 5:30 AMభారత్ మీద అనుక్షణం విషాన్ని కక్కుతూ.. ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్ గా వ్యవహరించే పాకిస్తాన్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు మొదలు పెట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. ఆ విషయాన్ని వదిలేసి భారత్ తో కయ్యానికి కాలుదువ్వే తీరు మొదట్నించి చూస్తున్నదే. యుద్ధమే వస్తే వారానికి మించి పోరాటం చేయలేదని.. ఆ దేశానికి సీన్ లేదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్న పరిస్థితి. యుద్ధం సంగతి తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఆ దేశానికి లేదన్న విషయం తాజాగా అర్థమైంది. భారత్ తో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో పాకిస్తాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఓవైపు భారత్ లో పరిస్థితులు బాగోలేవన్న తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న పాక్.. ముందు తన దేశంలోని దారుణ పరిస్థితుల్ని సరిదిద్దుకోవటం లేదు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో భారత ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటమే కాదు.. దేశ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. సరిహద్దు రాష్ట్రాల్లోని పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. కేవలం మూడురోజుల ఉద్రిక్త వాతావరణానికే పాకిస్తాన్ లో తీవ్రమైన ఇంధన కొరత చోటు చేసుకోవటం గమనార్హం. ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులకు బంద్ ప్రకటించటం దీనికి నిదర్శనంగా చెప్పాలి. అంతేకాదు.. పెట్రోల్.. డీజిల్ ధరలు భాగా పెరిగాయి. ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ లీటరు రూ.279.80 ఉండగా.. డీజిల్ రూ.262కు చేరుకుంది. ఇంత ధర పెట్టేందుకు సిద్ధమవుతున్నా.. పెట్రోల్.. డీజిల్ లభించని దుస్థితి.
ఇదిలా ఉండగా.. నిత్యవసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఉల్లిపాయిలు కేజీ రూ.330కు చేరుకోగా.. నిమ్మకాయలు కేజీ రూ.900లకు చేరుకున్నాయి. చికెన్ ధర కేజీ రూ.600 కాగా.. డజన్ కోడిగుడ్ల ధర రూ.300గా మారింది. దీంతో.. పాకిస్తాన్ ప్రజల జీవన వ్యయం తాజా ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయింది. సింధు జలాల ఒప్పందం బ్రేక్ తర్వాత పాకిస్తాన్ వ్యవసాయం.. జలవిద్యుత్ ఉత్పత్తి భారీవ్యగా పడిపోయింది. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఆహార కొరత సమస్య ఆ దేశాన్ని వెంటాడుతోంది.
ఆహార ధరలు పెరగటం ఒక ఎత్తు అయితే.. ఔషధాల కొరత కారణంగా కొన్ని ఆసుపత్రుల్లో నిర్వహించాల్సిన శస్త్రచికిత్సలను వాయిదా వేస్తున్నారు. దీంతో.. పాక్ ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఈ ఆర్థిక కష్టాలతో పలువురు పాకిస్తానీయులు అక్రమ రవాణా ద్వారా దేశాన్ని విడిచి పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వస్తువుల కొరత.. నిరుద్యోగం.. ద్రవ్యోల్బణం ముప్పు పాకిస్తాన్ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.