పాకిస్తాన్ ది అదే 'ఫేక్' బతుకు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫేక్ ఇమేజ్ను ఆధారంగా చేసుకుని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి పార్లమెంటులోనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.
By: Tupaki Desk | 17 May 2025 1:00 AM ISTభారత్పై పైచేయి సాధించామని చూపించుకోవడానికి పాకిస్తాన్ ఎలాంటి తప్పుడు ప్రచారాలకైనా పాల్పడుతోంది. తాజాగా, పాకిస్తాన్ పార్లమెంటులోనే నకిలీ వార్తలను ప్రచారం చేయడం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డర్ పార్లమెంట్ లో మాట్లాడుతూ బ్రిటిష్ వార్తా సంస్థ 'ది డైలీ టెలిగ్రాఫ్'లో "గగనతలంలో పాక్ ఎయిర్ ఫోర్స్ అడ్డేలేదు" అనే శీర్షికతో ఒక వార్త వచ్చిందని పేర్కొన్నారు.
అయితే ఈ వార్తపై భారత్ ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పరిశీలన జరపగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ది డైలీ టెలిగ్రాఫ్ పత్రికలో అలాంటి వార్త ఏదీ ప్రచురితం కాలేదని, ఇషాక్ డర్ ఉటంకించిన వార్త పూర్తిగా నిరాధారమైనదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆ వార్తా కథనానికి సంబంధించినదిగా చూపించిన చిత్రం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడిన నకిలీదని తేలింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫేక్ ఇమేజ్ను ఆధారంగా చేసుకుని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి పార్లమెంటులోనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. పాకిస్తాన్ తన వైమానిక దళం గొప్పదనాన్ని చాటుకోవడానికి.. భారత్పై విజయం సాధించినట్లుగా చూపించుకోవడానికి ఇలాంటి నిరాధారమైన ప్రచారాలకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి.
ఈ సంఘటన పాకిస్తాన్ ఎంతలా నకిలీ వార్తలను ఆధారంగా చేసుకుని తమ దేశ ప్రజలను, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుందో మరోసారి నిరూపించింది. పార్లమెంటు వంటి గౌరవప్రదమైన వేదికపై కూడా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రి ఇలాంటి ఫేక్ ప్రచారాలకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయం. వాస్తవాలను వక్రీకరించి, కల్పిత వార్తలతో తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని పాకిస్తాన్ చేసే ప్రయత్నాలకు ఈ ఘటనే నిదర్శనం. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సకాలంలో స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టడం ద్వారా పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది.
