బ్రేకింగ్ వీడియోలు: 10 ప్రాంతాల్లో మళ్లీ మొదలుపెట్టిన పాక్!
ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి సుమారు 10 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించిందని నివేదికలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలను ఏ.ఎన్.ఐ. ఎక్స్ లో పోస్ట్ చేసింది.
By: Tupaki Desk | 9 May 2025 10:14 PM ISTఆపరేషన్ సిందూర్ కి ప్రతీకారంగా అంటూ భారత్ పై పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గురువారం ఉదయం భారత్ లోని సైనిక శిబిరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ నౌకలతో దాడులు చేసింది. అయితే... వాటిని భారత గగనతల రక్షణ వ్యవస్థ సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టింది.
ఇక గురువారం రాత్రి జమ్మూ పౌర విమానాశ్రయం లక్ష్యంగా మళ్లీ డ్రోన్లు, యుద్ధ విమానాలను ప్రయోగించింది. వాటిని కూడా భారత్ సక్సెస్ ఫుల్ గా అడ్డుకుంది! ఈ రకంగా మే 8-9 తేదీల మధ్య రాత్రిలో 36 చోట్ల సుమారు 300 నుంచి 400 డ్రోన్లను భారత్ లోని వివిధ ప్రాంతాల్లో లక్ష్యంగా పాకిస్థాన్ ప్రయోగించినట్లు కేంద్రం తెలిపింది.
మరోవైపు డ్రోన్, క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటినుంచీ పాకిస్థాన్ పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదని.. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయని రక్షణశాఖ వెల్లడించింది. భారత్ నుంచి ఎలాగూ ప్రతిస్పందన ఉంటుందని తెలిసీ.. అందుకు పౌర విమానాలను పాకిస్థాన్ రక్షణ కవచంగా వాడుకుంటోందని వెళ్లడించింది.
అయితే.. భారత్ – పాక్ సరిహద్దుల్లో వెళ్లే అంతర్జాతీయ పౌర విమానాలను దృష్టిలో ఉంచుకుని భారత వాయుసేన సంయమనంగా వ్యవహరించిందని కేంద్రం తెలిపింది. ఈ విధంగా అంత ఘోరంగా ఆలోచిస్తున్న పాక్.. శుక్రవారం మరోసారి డ్రోన్లను ప్రయోగించిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని చెబుతున్నారు.
అవును... జమ్మూకశ్మీర్ లోని పూంచ్, ఉరితో సహా పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ కాల్పులు జరపడంతో వరుసగా రెండో రోజు జమ్మూలో సైరన్లు మోగాయి. ఇదే సమయంలో నగరం రెండో రోజు కూడా బ్లాక్ అవుట్ ను చూసింది. ఇదే సమయంలో సాంబాతో పాటు పలు ప్రాంతంలో డ్రోన్ల దాడులకు పాల్పడిందని చెబుతూ ఏ.ఎన్.ఐ. వీడియోలు విడుదల చేసింది.
ఇదే సమయంలో పాక్ డ్రోన్లను భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలిపింది. దీంతో... చీకటిపడితే చాలు పాకిస్థాన్.. భారత్ లక్ష్యంగా దాడులు కంటిన్యూ చేస్తూ.. తమ దేశంపై భారత వాయుసేన దాడులు చేయకుండా పౌరుల ప్రాణాలను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి సుమారు 10 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించిందని నివేదికలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలను ఏ.ఎన్.ఐ. ఎక్స్ లో పోస్ట్ చేసింది.
1. సాంబ (జమ్మూకశ్మీర్)
2. కుప్వారా (ఉత్తరకాశ్మీర్)
3. ఉరి (బారాముల్లా జిల్లా)
4. నౌగాం - హంద్వారా సెక్టార్
5. పూంచ్ (జమ్మూకశ్మీర్)
6. జమ్మూ
7. పఠాన్ కోట్ (పంజాబ్)
8. పోఖ్రాన్ (రాజస్థాన్)
9. అమృత్ సర్ (పంజాబ్)
10. రాజౌరి (జమ్మూకశ్మీర్)