Begin typing your search above and press return to search.

'రక్షణ కవచంగా పిల్లలను ఉపయోగిస్తాం'... తెగించేసిన పాకిస్థాన్!

ఇందులో భాగంగా.. గురువారం భారత్ లో 36 ప్రదేశాల్లో సుమారు 300 - 400 డ్రోన్లను పాక్ ప్రయోగించింది..

By:  Tupaki Desk   |   9 May 2025 11:39 PM IST
రక్షణ కవచంగా పిల్లలను ఉపయోగిస్తాం...  తెగించేసిన పాకిస్థాన్!
X

ఇటీవల కాలంలో అంతర్జాతీయ మీడియాలో అత్యంత కార్టూన్ అయిపోయిన నేత ఎవరైనా ఉన్నారంటే.. అది పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి అని న్యూస్ ఫాలో అయ్యేవారు టక్కున చెప్పే అవకాశం ఉంది! పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ఇటీవల బ్రిటీష్ మీడియాతో మాట్లాడుతూ తన పరిజ్ఞానాన్ని బయటప్రపంచానికి పరిచయం చేశారు.

ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరు చెప్పి పాక్ దత్తపుత్రులైన ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను భూస్థాపితం చేశామని భారత్ సగర్వంగా చెప్పుకుంటే... తాము కూడా భారత్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని.. ఆపరేషన్ సిందూర్ ను సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టామని ఆత్మవంచన మాటలు మాట్లాడారు మంత్రి.

సరే.. అతని ఆత్మ, అతని వంచన అని అనుకున్న అనంతరం.. దీనికి ప్రూఫ్ ఏమిటి అని ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తే... ‘ఆ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది’ అని చెప్పిన దేశ రక్షణ శాఖ మంత్రి ఈయన. ఈ స్థాయి టాలెంటెడ్ మంత్రి.. పౌరులను రక్షణ కవచాలుగా పెట్టుకుంటుంది పాక్ అనే భారత్ వ్యాఖ్యల వేళ ఘోరంగా స్పందించారు!

అవును... తాజాగా కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రవర్తనపై షాకింగ్ విషయం చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. గురువారం భారత్ లో 36 ప్రదేశాల్లో సుమారు 300 - 400 డ్రోన్లను పాక్ ప్రయోగించింది.. ఈ సమయంలో భారత్ వైమానిక దాడులు చేయకుండా పాకిస్థాన్ గగనతలంలో పౌర విమానాలు నడుపుతుంది అని తెలిపింది.

పౌర విమానాలను పాకిస్థాన్ రక్షణ కవచంగా వాడుకుంటోందని వెళ్లడించింది. అయితే.. భారత్ – పాక్ సరిహద్దుల్లో వెళ్లే అంతర్జాతీయ పౌర విమానాలను దృష్టిలో ఉంచుకుని భారత వాయుసేన సంయమనంగా వ్యవహరించిందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో స్పందించిన పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజీ ఆసిఫ్.. అవసరమైతే మదర్సాలో పిల్లలను కూడా వాడతాం అన్నారు!

పాకిస్థాన్ లోని పలు ప్రదేశాల్లో భారత్ ప్రతీకార డ్రోన్ దాడులు చేసిందని.. ఫలితంగా పాక్ ప్రధాని సేఫ్ హౌస్ కు షిఫ్ట్ అయిపోయారని.. కరాచీ నౌకాశ్రయంలో భారత్ దీపావళి చేసుకుందని అంటున్న వేళ.. పార్లమెంటు సమావేశంలో ప్రసంగించారు ఖవాజీ ఆసిఫ్. ఈ నేపథ్యంలోనే మదర్సాలో పిల్లల ప్రస్థావన తెచ్చారు.

ఇందులో భాగంగా... ‘మదర్సాలు లేదా మదర్సా విద్యార్థుల విషయానికొస్తే.. వారు మా రెండో రక్షణ శ్రేణి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ చదువుతున్న వారు యువకులు.. సమయం వచ్చినప్పుడు వారిని 100% అవసరమైన విధంగా ఉపయోగిస్తాం’ అని ఖవాజీ ఆసిఫ్ అన్నారు.

దీంతో.. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలు అన్నీ మదర్సాల పేరుతో నడుస్తున్నాయని.. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్ మొదలైన వాటన్నింటికీ అవే కేంద్రాలుగా ఉంటున్నాయని అంటున్న వేళ.. తాజాగా పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.