'పుల్వామా దాడి మా వ్యూహాత్మక ప్రతిభ'... అంగీకరించిన పాక్!
ఏప్రిల్ 22న పహల్గాంలో అమాయకులపై పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 11:19 AMఏప్రిల్ 22న పహల్గాంలో అమాయకులపై పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. అందులో 24 మంది భారతీయ మహిళలు నుదుటన తమ సిందూరాన్ని దూరం చేసుకున్నారు. దీంతో ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ చేసింది భారత్! దీంతో... పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రమూకలపై విరుచుకుపడింది.
దీనిపై స్పందించిన పాక్... అసలు ఉగ్రవాదులకు తమకూ ఎలాంటి సంబంధం లేదని.. తాము కూడా ఉగ్రవాద బాధితులమే అని బుకాయించడం మొదలుపెట్టింది. మరోపక్క ఆపరేషన్ సిందూర్ దాడిలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల శవపేటికలపై పాకిస్థాన్ జాతీయ జెండా కప్పింది!
దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో... పాకిస్థాన్ కు ఉగ్రవాదులకు ఉన్న సంబంధానికి ఇది తాజా ఉదాహరణ అని మెజారిటీ ప్రపచం మొత్తం అంగీకరించింది! ఆ ఫోటోలు ట్రంప్ & కో కూడా చూసి ఉండోచ్చు.. ఆ వీడియోలు మోడీ & కో కూడా వీక్షించి ఉండోచ్చు! అయినప్పటికీ కాల్పుల విరమణకు అంగీకరించారు!!
దీంతో... పాకిస్థాన్ లో ప్రజానికం భారత్ పై గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు. వీధుల్లోకి రాకెట్ లాంఛర్ లు, ఏకే-47 తుపాకులు తెచ్చి ర్యాలీలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు చూసిన భారతీయులకు పుండు మీద కారం చల్లినట్లుందని అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో... పుల్వామా దాడి మా పనే అని అంగీకరించింది పాకిస్థాన్!
అవును... 2019 ఫిబ్రవరి 14న జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ పారామిలటరీ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాల కాన్వాయ్ పైకి ఇంప్రొవైస్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) లతో నిండి ఉన్న కారు వచ్చి ఢీకొట్టింది. ఆ ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు మరణించారు.
ఆ సమయంలో.. రోడ్డుపై భారత పారామిలటరీ సిబ్బంది శరీరాలు మాంసపు ముద్దలుగా చల్లా చెదురుగా పడి ఉన్నాయి! ఆ సమయంలో డీ.ఎన్.ఏ పరీక్షలు చేసి, ఆ పరీక్షలతో సెట్ అయిన మాంసపు ముద్దలను వారి వారి కుటుంబ సభ్యులకు పేటికలో పెట్టి చూపించిన పరిస్థితి! అది ఎప్పటికీ భరతమాత గుండెల్లో తరగని ఆవేదన!
అయితే.. కశ్మీర్ లోని పుల్వామాలో 40 మంది పారామిలటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబుదాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని తాజాగా ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మీడియా సమావేశంలో అంగీకరించారు. పైగా దాన్ని తమ వ్యూహాత్మక ప్రతిభగా అభివర్ణించారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన అహ్మద్... పాకిస్థాన్ కు చెందిన భూభాగం, గగనతలం, జల సరిహద్దులకు, ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే వాటిని ఎదుర్కొనేందుకు తాము రాజీ పడబోమని.. మా దేశానికి మేము కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ నేపథ్యంలోనే పుల్వామా టాపిక్ తెచ్చారు.
ఇందులో భాగంగా... పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించామని.. మా కార్యదక్షత, వ్యూహాత్మక ప్రతిభను ఇప్పటికే ప్రదర్శించామని.. మా దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లోనే ఇమిడి ఉండటంతో తాము ఎప్పుడూ దాన్ని నిలబెట్టుకుంటామని వ్యాఖ్యానించారు.
దీంతో... ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని పాకిస్థాన్ పెద్దలు చెబుతున్న కబుర్లు, నొక్కుతున్న సన్నాయిలు మొత్తం అసత్యాలని మరోసారి రుజువైందని తెలుస్తోంది. మరోవైపు... నాడు పుల్వామా ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని నాడు బుకాయించిన పాక్.. ఇప్పుడు అంగీకరించింది! ఈ నేపథ్యంలో... మరోసారి కాల్పుల విరమణ టాపిక్ వచ్చినప్పుడు.. 2025లో పహల్గాం ఘటన కూడా తమ ప్రతిభే అని ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు నెటిజన్లు!